అమెరికన్లను భయాందోళనలకు గురి చేస్తోన్న జో బిడెన్ హెచ్చరికలు: మరింత మంది చనిపోతారంటూ
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. తాజాగా చేసిన ఓ ప్రకటన ఆ దేశ ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడిని తీసుకొచ్చేలా, ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకతను కలిగించేలా చేసిన ప్రకటనగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్.. తన ఓటమిని అంగీకరించకపోవడం వల్ల దేశంలో విపరీత పరిణామాలు నెలకొంటున్నాయంటూ జో బిడెన్ తాజాగా వ్యాఖ్యానించారు.

లేబర్ లీడర్లు, సీఈఓలతో జో బిడెన్ భేటీ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ వైఖరి అమెరికన్లను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ లీడర్లు, అమెరికాకు చెందిన పలు టాప్ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో తన సొంత రాష్ట్రం డెల్వర్లోని విల్మింగ్టన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వల్ల కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాము సహకరిస్తామని లేబర్ లీడర్లు, ఆయా కంపెనీల సీఈఓలు హామీ ఇచ్చారని తెలిపారు. వారితో నిర్వహించిన భేటీ సంతృప్తికరంగా ముగిసిందని చెప్పారు.

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జాప్యం..
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని, ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణా చర్యలు స్తంభించిపోయే ప్రమాదం నెలకొందని అన్నారు. ఫలితంగా- కరోనా నివారణ చర్యలతో ముడిపడి ఉన్న వివిధ శాఖల మధ్య సమన్వయం కొరవడిందని, దీనివల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే- మరింతమంది అమెరికన్లు కరోనా బారిన పడి మరణిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికార మార్పిడి పూర్తయినా..
అమెరికాలో ప్రభుత్వం మారిందనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎంత త్వరగా అంగీకరిస్తే.. అంత మేలు చేసిన వారవుతారని చెప్పారు. అధికార మార్పడి చోటు చేసుకుందనే విషయాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే వైట్హౌస్ను వీడటానికి సుముఖంగా లేరని బిడెన్ విమర్శించారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత మరింత ముదురుతోందని, కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోందని, దాన్ని నివారించడానికి తక్షణ చర్యలను తీసుకోవాల్సి అవసరం ఉందని, లేదంటే మరిన్ని మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
Recommended Video

ఏప్రిల్ నాటికి వ్యాక్సిన్..
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అమెరికాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, దాన్ని చిట్టచివరి వ్యక్తి వరకు సరఫరా చేస్తామని జో బిడెన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం అనేక సవాళ్లతో కూడుకుని ఉన్నదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సరఫరా కోసం సమగ్రమైన రవాణా ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని, ట్రంప్ ప్రభుత్వం దాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించకపోవడం వల్ల ఆ ప్రణాళికలను రూపొందించడంలో జాప్యం చోటు చేసుకోందని చెప్పారు.












Click it and Unblock the Notifications