అమెరికాలో మూడో డోస్ కరోనా వ్యాక్సిన్: టీకా వేయించుకున్న బైడెన్: ఇప్పటికింకా నా వయస్సు..!
వాషింగ్టన్: అమెరికాలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గట్లేదు. పాజిటివ్ కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. రోజువారీ కేసులు చెప్పుకోదగ్గ సంఖ్యలో నమోదవుతూనే వస్తోన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరణాలు కూడా అదే స్థాయిలో ఉంటోన్నాయి. అమెరికాలో కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య ఏడు లక్షలను దాటేసింది.
పాజిటివ్ కేసులు.. మరణాల్లో టాప్లో యూఎస్
ఇప్పటిదాకా అమెరికాలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,39,15,449కి చేరింది. ఇందులో 3,33,31,717 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 7,08,052 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 98,75,680గా రికార్డయింది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,31,718 మంది వైరస్ బారిన పడుతున్నారు.. 2,124 మంది మరణిస్తున్నారు. కొత్తగా 24 గంటల వ్యవధిలో 68,609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మూడో డోస్గా బూస్టర్ షాట్..
ఈ పరిణామాల మధ్య అమెరికాలో మూడో డోస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ను దేశ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది జో బైడెన్ ప్రభుత్వం. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అక్కడ ముమ్మరంగా సాగుతోంది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. తాజాగా- మూడో విడత బూస్టర్ వ్యాక్సిన్ డోస్ కూడా ఈ కార్యక్రమంలోకి చేర్చారు. దీనికి అవసరమైన పాలనా పరమైన అనుమతులను జో బైడెన్ ఇదివరకే జారీ చేశారు.
65 సంవత్సరాలకు పైనున్న వారికి..
మూడో విడతగా బూస్టర్ డోస్ ఇంజెక్షన్ను ఆయన తీసుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం వైట్హౌస్లో డాక్టర్లు ఆయనకు బూస్టర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చారు. 65 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇచ్చేలా బైడెన్ ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఆయన ఈ మూడో విడతగా బూస్టర్ డోస్ను తీసుకున్నారు. ఇంతకుముందు 65 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి వ్యాక్సిన్ ఇచ్చే విధానం అమలులో ఉండేది కాదు.
దేశాన్ని డ్యామేజ్ చేయొద్దు..
జో బైడెన్ వయస్సు 78 సంవత్సరాలు. వైట్హౌస్లో వ్యాక్సిన్ షాట్ తీసుకున్న అనంతరం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికింకా తన వయస్సు 65 సంవత్సరాలుగానే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హైరిస్క్ ఉన్న వయస్సు వారికి వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోని వారు దేశాన్ని డ్యామేజ్ చేస్తోన్నారని అన్నారు.
Recommended Video
ఇంకా భయాలేనా?
వ్యాక్సిన్ పట్ల ఇప్పటికీ భయాందోళనలను కలిగి ఉండటం సరి కాదని పేర్కొన్నారు. 65 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారిని వ్యాక్సిన్ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల త్వరలోనే వందశాతం లక్ష్యాన్ని అందుకున్నట్టవుతుందని జో బైడెన్ చెప్పారు. ప్రతి పౌరుడిని వ్యాక్సినేటెడ్ చేయాలనేది తమ లక్ష్యమని, దాన్ని అందుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన బూస్టర్ డోసులు త్వరలోనే అందుబాటులోకి వచ్చేలా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ చర్యలు తీసుకుంటోందని, వచ్చే వారంలోగా ఈ రెండు కంపెనీల బూస్టర్ డోసులు వినియోగంలోకి తెస్తామని చెప్పారు.