ఉక్రెయిన్లో జో బైడెన్ ల్యాండ్- ఆకస్మిక పర్యటనతో బెంబేలు..!!
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఏడాది పూర్తి కావొస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఈ యుద్ధం ఆరంభమైంది. ఈ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటిస్తోన్నారు.
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది నిండుతుంది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.
ఒత్తిళ్లను ఎదుర్కొంటూ..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

ఉక్రెయిన్ ప్రతిఘటన..
రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. ఇన్ని నెలలుగా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించింది కూడా. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ..వారిని వెనక్కి పంపించగలిగింది.
అమెరికా కీలక ప్రకటన..
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలనం సృష్టించారు. ఉక్రెయిన్ లో ల్యాండ్ అయ్యారు. ఆయన ఉక్రెయిన్ లో పర్యటిస్తారనే సమాచారం ఎవరికీ తెలియదు. వైట్ హౌస్ తో పాటు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ లోని అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. భద్రత కారణాల వల్ల జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచాల్సి వచ్చిందని పెంటగాన్ చెబుతోంది.

జెలెన్ స్కీతో భేటీ..
కొద్దిసేపటి కిందటే జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకున్నారు. వెంటనే ప్రత్యేక వాహనంలో ఆ దేశాధ్యక్షుడి అధికార నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. జో బైడెన్ తో పాటు వచ్చిన అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రతినిధులతో వొలొదిమిర్ జెలెన్ స్కీ సమావేశం అయ్యారు.
ఇదే తొలిసారి..
రష్యా గత ఏడాది ఇదే ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధానికి దిగిన తరువాత జో బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు ఆయన పోలెండ్ లో పర్యటించారు. ఉక్రెయిన్ కు ఆనుకునే ఉండే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యత్వ దేశం ఇది. పోలెండ్- ఉక్రెయిన్ సరిహద్దు నగరంలో కూర్చుని మరీ యుద్ధం స్థితిగతులను జో బైడెన్ సమీక్షించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఏకంగా ఉక్రెయిన్ లోనే ల్యాండ్ కావడం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications