జో బైడెన్, జిన్పింగ్ ఫేస్ టు ఫేస్: మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ: దేశాధినేతల మధ్య కీలక భేటీ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధి నాయకుడు గ్ఝి జిన్పింగ్తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఈ సమ్మిట్ ఆరంభమైంది. వర్చువల్ విధానంలో ఈ రెండు దేశాధినేతల మధ్య అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. తన అధికారిక నివాసం వైట్హౌస్ నుంచి జో బైడెన్- ఈ భేటీలో పాల్గొన్నారు. విదేశాంగ, వాణిజ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. బీజింగ్లోని తన అధికారిక నివాసం ఝోంగ్నన్హాయ్ నుంచి జిన్పింగ్ ఈ భేటీలో పాల్గొన్నారు.
ముఖాముఖిగా..
ఈ ఇద్దరు దేశాధినేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ఇదివరకు వారిద్దరూ కలుసుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ.. అవి జీ7 వంటి వేదికలు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయనను అభినందించడానికి జిన్పింగ్ ఫోన్లో మాట్లాడారు. తాజాగా- వారిద్దరు వర్చువల్ విధానంలో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్యం, రక్షణ రంగం, దౌత్య సంబంధాలు, ఒప్పందాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
ట్రంప్ హయాంలో..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హయాంలో చైనాపై దూకుడుగా వ్యవహరించారు. కొన్ని ఆంక్షలను విధించారు. ఉయ్ఘుర్ ప్రావిన్స్లో నివసించే ముస్లింలపై చైనా తరచూ దాడులకు పాల్పడుతోందని, వారిపై వివక్షత చూపుతోందనే కారణంతో అప్పట్లో డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్యపరమైన యుద్ధానికి తెర తీశారు. ఉయ్ఘుర్ ప్రావిన్స్ పరిధిలో ఉన్న పరిశ్రమల నుంచి ఉత్పత్తయ్యే వస్తువులను దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించారు. ఆ చర్య రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్కు దారి తీసింది. ఉద్రిక్తతలకు కారణమైంది.
విభేదాలకు చెక్..
ఈ పరిణామాల నేపథ్యంలో జో బైడెన్-జిన్పింగ్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత జో బైడెన్ ఈ భేటీని ప్రారంభించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య నెలకొన్న అవాంఛనీయ పరిస్థితులు, వాతావరణాన్ని తొలగించాల్సిన బాధ్యత.. అధ్యక్షులుగా తమ మీద ఉందని గుర్తు చేశారు. ఆ పరిస్థితులు మరింత ముదరకుండా చూడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. అన్ని రకాలుగా సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పాత స్నేహితుడిని కలుసుకోవడం..
ఈ రకంగా తన పాత స్నేహితుడిని కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ జో బైడెన్ వ్యాఖ్యానించాడు. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటోన్న అనేక రకాల సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తమ రెండు దేశాల మధ్య స్థిరత్వంతో కూడిన దౌత్య సంబంధాలు సుదర్ఘకాలం పాటు కొనసాగడం అత్యవసరమని జో బైడెన్ పేర్కొన్నారు.
Recommended Video
బైడెన్తో ఏకీభవించిన జిన్పింగ్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం, వాతావరణ మార్పులు వంటి సంక్లిష్ట పరిస్థితులు ప్రపంచాన్ని చుట్టేసిన ప్రస్తుత పరిస్థితుల్లో తమ రెండు దేశాల మధ్య నిలకడతో కూడిన ద్వైపాక్షిక సంబంధాలన కొనసాగింపజేసుకోవడం, వాణిజ్య, రక్షణపరమైన ఒప్పందాలను కుదుర్చుకోవడం, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం అవసరమని చెప్పుకొచ్చారు. వాటన్నింటికీ చైనా అధ్యక్షుడి నుంచి సానుకూల స్పందన కనిపించింది. పలు అంశాల్లో జిన్పింగ్.. జో బైడెన్తో ఏకీభవించారు.