జిన్పింగ్కు జో బైడెన్ ఫోన్కాల్: సరికొత్త సమస్యలకు కారణం కాకూడదనే..!
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు కరడుగట్టిన మత ఛాందసవాదులు తాలిబన్లు. దీనికి సంబంధించిన పదవుల పంపకాలు కూడా పూర్తయ్యాయి. ఎవరు.. ఏ పదవిని చేపట్టాలనేది కూడా ఇటీవలే తేలిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం ఒక్కటే మిగిలి ఉంది. తాలిబన్ల ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించబోదనే విషయం ఇదివరకే స్పష్టమైంది. తాలిబన్లతోనే చైనాకు అసలు సమస్య పొంచివుందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాంబు పేల్చారు కూడా.
Big Boss Telugu 5: బిగ్బాస్ హౌస్లో ఫిమేల్ అర్జున్ రెడ్డి: ఆ అగ్రిసివ్ నెస్కు నెటిజన్స్ ఫిదా
చైనా-ఆఫ్ఘన్ రిలేషన్స్..
కొద్దిరోజుల కిందటే చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ.. కాబుల్లో తాలిబన్ పొలిటికల్ కమిషన్ అధినేత ముల్లా అబ్దుల్ బరాదర్తో సమావేశమైన విషయాన్ని జో బైడెన్ పరోక్షంగా ప్రస్తావించారు. ఈ భేటీని ఆయన ఉదాహరణగా చూపారు. ఆ ఇద్దరు నేతలు సమావేశం కావడాన్ని తాలిబన్లు-చైనా మధ్య ఉన్న సత్సంబంధాలను బహిర్గతం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. రాజధాని కాబుల్ను ఆక్రమించుకోవడానికి ముందే- ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటవుతుందనే నిర్ణయానికి చైనా వచ్చిందని అన్నారు.
ఫండింగ్ కామెంట్స్ తరువాత.. ఫోన్
తాలిబన్లు బలోపేతం కావడానికి చైనా సహకరిస్తోందని, వారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తోందంటూ జో బైడెన్ చెప్పడం.. ఆసక్తిని రేపింది. దీనిపై విస్తృతస్థాయిలో డిబేట్స్ కూడా మొదలయ్యాయి. ఈ కామెంట్స్ చేసిన రెండు రోజులకే జో బైడెన్.. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్కు ఫోన్ చేశారు. జిన్పింగ్కు ఆయన ఫోన్ చేయడం ఏడు నెలల తరువాత ఇదే తొలిసారి. ఇదివరకు ఫిబ్రవరిలో వారిద్దరి మధ్య రెండు గంటలకు పైగా సుదీర్ఘ సంభాషణ సాగింది.
కొత్త సమస్యలకు కారణం..
జిన్పింగ్-జో బైడెన్ మధ్య చోటు చేసుకున్న టెలిఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను వైట్హౌస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో రెండు శక్తిమంతమైన దేశాలుగా ఉన్న తమ మధ్య నెలకొన్న పోటీ వాతావరణం సరికొత్త సమస్యలకు కారణం కాకూడదని జో బైడెన్ స్పష్టం చేశారని వైట్హౌస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చైనాతో ఆరోగ్యకరమైన పోటీని కోరుకుంటున్నామని అన్నారు. అది కొత్త సమస్యలు, అనారోగ్యకరమైన పోటీకి దారి తీయకూడదని చెప్పారు.
నిర్ణయాల్లేవు గానీ..
ఇదే విషయాన్ని జో బైడెన్- తన చైనా కౌంటర్పార్ట్ గ్ఝి జిన్పింగ్కు స్పష్టం చేశారని వైట్హౌస్ అధికార ప్రతినిధి చెప్పారు. రెండు దేశాధినేతలు కూడా వ్యూహాత్మక ఒప్పందాలు, దౌత్య సంబంధాల గురించి విస్తృతంగా సంభాషించారని, వేర్వేరు రంగాలకు సంబంధించి వారిద్దరు లోతుగా చర్చించారని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి నిర్ణయాలను వారు తీసుకోలేదని, కేవలం సంభాషణలకే పరిమితం అయ్యారని స్పష్టం చేశారు.
ట్రేడ్ వార్ ఇంకా..
నిజానికి.. చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇదివరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన డొనాల్డ్ ట్రంప్.. చైనా దిగుమతులపై కఠిన ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ఒకరకంగా డొనాల్డ్ ట్రంప్.. చైనాతో వాణిజ్యపరమైన యుద్ధానికి తెర తీశారు. ఈ చర్య ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. డొనాల్డ్ ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన జో బైడెన్ కూడా- వాటిని కొనసాగించారే తప్ప ఎత్తివేయలేదు.
Recommended Video
తాజా పరిణామాలేంటీ?
ఈ పరిస్థితుల మధ్య తాలిబన్లు.. ఆప్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడం- వారికి చైనా ఫండింగ్ చేస్తోందంటూ జో బైడెన్ వ్యాఖ్యానించడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచినట్టయింది. అదే సమయంలో ఆయనే స్వయంగా జిన్పింగ్కు ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకుంటోన్న తాజా పరిణామాలు గానీ.. తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు గానీ వారిద్దరి మధ్య చర్చకు రాలేదని వైట్హౌస్ తెలిపింది.