ఆ విషయంపై భారత్ ను హెచ్చరించా..: వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఇజ్రాయెల్ కు బయలుదేరి వెళ్లడం ఇదే తొలిసారి. గాజాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కాల్పులు విరమణ కుదిరన తర్వాత ఆయన ఇజ్రాయెల్ విమానం ఎక్కడం చర్చనీయాంశమైంది. తన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈజిప్టులో జరిగే ఉన్నత స్థాయి శాంతి సదస్సుకు ట్రంప్ కో ఛైర్మన్ వహించనున్నారు.
ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. గాజా యుద్ధం ముగిసిందని ప్రకటించారు. త్వరలోనే మధ్య- తూర్పు రీజియన్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు కృషి చేసినందుకు ఖతార్ను అభినందించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పనితీరు పట్ల ప్రశంసించారు. హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని మంచి పని చేశారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు ఊహించిన దానికంటే ముందుగానే విడుదల కావచ్చని ట్రంప్ తెలిపారు. గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి త్వరలో బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం గాజా విధ్వంసకర ప్రాంతంగా ఉందని, దీన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల యూదులు, ముస్లింలు.. ప్రత్యేకించి అరబ్ దేశాలు.. సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని గుర్తు చేశారు. భారత్- పాకిస్తాన్ సహా వివిధ దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణాన్ని చల్లార్చడానికి టారిఫ్లను ఓ సాధనంగా ఉపయోగించానని పేర్కొన్నారు. కొన్ని యుద్ధాలను టారిఫ్ల ద్వారానే పరిష్కరించానని, ఇందులో భారత్, పాకిస్తాన్ కూడా ఉందని అన్నారు.యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటే భారీ టారిఫ్ విధిస్తానని, అది 100, 150, 200 శాతం వరకు ఉండొచ్చని, వ్యాపారం చేయబోమని, భారత్, పాకిస్తాన్ లను హెచ్చరించానని ట్రంప్ తెలిపారు.
రెండు దేశాలపై భారీ టారిఫ్స్ విధిస్తానని తాను బెదిరించడం వల్లే పరిస్థితి త్వరగా అదుపులోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. టారిఫ్ బెదిరింపులు ప్రపంచ దేశాల్లో శాంతియుత వాతావరణానికి దారి తీసిందని వ్యాఖ్యానించారాయన. ఇప్పటివరకు ఏడు శాంతి ఒప్పందాలు కుదుర్చానని అన్నారు. అనేక దేశాలు చాలా సంవత్సరాలుగా భారీ ప్రాణనష్టంతో పోరాడుతున్నాయని, తన వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలను ఉపయోగించడం వల్ల శత్రుత్వాలు ముగిశాయని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications