చైనా చేసిన ఆ పని వల్లే ప్రపంచానికి ఈ పరిస్థితి: మరోసారి విరుచుకుపడ్డ అగ్రరాజ్యం
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీసిన మహమ్మారి కరోనావైరస్ చైనా సృష్టేనంటూ మొదట్నుంచి ఆరోపిస్తూ వస్తున్న అమెరికా.. ఇప్పుడు మరింత పదునైన విమర్శలను ఎక్కుపెట్టింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తీవ్రంగా మండిపడుతుండగా.. తాజాగా యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన వంతు అన్నట్లు చైనాపై విమర్శలు గుప్పించారు.

కరోనా తీవ్రతపై కావాలనే...
కరోనావైరస్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వచ్చిందనడానికి అనేక ఆధారాలున్నాయని పాంపియో తెలిపారు. అయితే, చైనా ఉద్దేశ పూర్వకంగానే ఈ వైరస్ బయటకు వదిలి ఉంటుందా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. కరోనావైరస్ తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని చైనా కావాలనే తొక్కిపెట్టిందని, ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఉపద్రవానికి డ్రాగన్ దేశానిదే బాధ్యత అని మైక్ పాంపియో ఆరోపించారు.

చైనా దాచడం వల్లే ప్రపంచానికి ఈ పరిస్థితి..
తొలినాళ్లలో వైరస్కు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడమే ఈ పరిస్థితులకు దారితీసిందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులకు చైనాదే బాధ్యత అని, ఆ అభిప్రాయంతోనే ట్రంప్ ఉన్నారని పాంపియో స్పష్టం చేశారు. కాగా, వూహాన్ ల్యాబ్ నుంచే కరోనావైరస్ ఉద్భవించిందనడానికి మరిన్ని బలమైన ఆధారాలు సేకరించాలని ట్రంప్ నిఘా వర్గాలను ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

గతంలోనూ డ్రాగన్ దేశం అంతే..
గతంలోనూ ప్రపంచం మొత్తానికి అంటువ్యాధుల్ని అందించిన చరిత్ర చైనా ఉందని పాంపియో ఆరోపించారు. వైరస్ మానవ సృష్టి కాదన్న నిఘా సంస్థల నివేదికలను అంగీకరిస్తూనే చైనాపై ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం. కాగా, పాంపియోకు గతంలో నిఘా సంస్థల్లో పనిచేసిన అనుభవముంది. ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ పాంపియో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు మందుల పంపిణీని కూడా చైనా తగ్గించినట్లు అమెరికా ఆరోపిస్తోంది.
Recommended Video

అమెరికాలో 70వేలకు చేరువలో మరణాలు.. చైనాలో 481 యాక్టివ్ కేసులు
కరోనా మహమ్మారి బారినపడి అమెరికాలోన అత్యధిక మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటి వరకు 11,88,421 మంది కరోనా బారిన పడగా, 68,602 మంది మరణించారు. 1,78,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 941225 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్పెయిన్, ఇటలీ, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒక్కో దేశంలో 20వేల మందికిపైగా చనిపోయారు. కరోనాకు పుట్టినిల్లైనా చైనాలో 4633 మంది మరణించారు. ప్రస్తుతం చైనాలో 481 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications