ఆ నాలుగు భారత కంపెనీలపై అమెరికా వేటు, ఇరాన్ చమురు కొంటే అంతే..
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఇరాన్ నుంచి చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యం సాగిస్తున్నాయన్న ఆరోపణలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలపై తీవ్ర ఆంక్షలు విధించింది. ఈ భారీ చర్యలో భాగంగా నాలుగు భారతీయ కంపెనీలతో పాటు ముగ్గురు భారత పౌరులను టార్గెట్ చేస్తూ వాషింగ్టన్ కీలక నిర్ణయం తీసుకుంది. డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా యంత్రాంగం చేపట్టిన 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్' వ్యూహంలో భాగంగా ఈ కఠిన నిర్ణయాలు బయటకొచ్చాయి.
వందల కోట్ల వాణిజ్య వ్యవహారాలే టార్గెట్
ఇరాన్ నుంచి అక్రమంగా చమురు దిగుమతి చేసుకున్న వ్యవహారంలో ప్రధానంగా రూ.1,000 కోట్లకు పైగా (సుమారు 119 మిలియన్ డాలర్లు) వాణిజ్యం జరిగినట్లు అమెరికా ఖజానా శాఖ గురిపెట్టింది. భారతదేశానికి చెందిన 'సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్' అనే సంస్థ గత ఏడాదిన్నర కాలంలో ఏకంగా రూ.580 కోట్లకు పైగా విలువైన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుందని ఆరోపించింది. దీంతో పాటు 'పిపి సాఫ్ట్టెక్', 'ప్రకృతిస్ ఇన్ఫ్రా ఇంపెక్స్' అనే మరో రెండు కంపెనీలు సైతం భారీ స్థాయిలో చమురు కొనుగోళ్ళు జరిపినట్లు తేల్చింది. ఇక కస్టమ్స్ క్లియరెన్స్ చూసే 'పోర్ట్ఈజ్ పార్ట్నర్స్' అనే డోకింగ్ సంస్థ ఇరాన్ సరుకు భారత్లోకి రావడానికి సహకరించిందని భావిస్తూ దానిపై కూడా వేటు వేసింది.

అమెరికా 'ఆర్థిక డి-డే' హెచ్చరికలు
పిపి సాఫ్ట్టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గర్గ్తో పాటు పోర్ట్ఈజ్ సంస్థ భాగస్వాములైన ఇద్రిస్మియా షేక్, హరీష్ రంఛోడ్దాస్ రంగీలను ఈ జాబితాలో చేర్చారు. ఇరాన్పై చేపడుతున్న చర్యలను "ఆర్థిక డి-డే" (ఆర్థిక యుద్దభేరి)గా అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ అభివర్ణించారు. తేలికపాటి వ్యాపార సంబంధాలు ఉన్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం భారత్ మాత్రమే కాకుండా చైనా, హాంకాంగ్లకు చెందిన దాదాపు 20 సంస్థలు, సరుకు రవాణా చేసే నౌకలతో కలిపి మొత్తంగా 60కి పైగా సంస్థలపై అమెరికా ఒకేసారి ఆంక్షల ఉక్కుపాదం మోపడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.
అమెరికా 'పెద్ద మాటలను' లెక్కచేయం: ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా విధిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇటువంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అమెరికా ఆర్థికంగా స్వయంగా ఒత్తిడిలో ఉంటూ ఇతరులను బెదిరించాలని చూస్తోందని, ఇవి కేవలం "పెద్ద మాటలు" తప్ప ఆచరణలో ఏమీ ఉండవని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాబోయే రెండేళ్ల పాటు ఈ తరహా ఆర్థిక ఆంక్షలను తట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆ దేశ ఆర్థిక మంత్రి ప్రకటించారు.
దిగివస్తున్న అంతర్జాతీయ చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణల నుంచి ఆర్థిక ఆంక్షల వైపు దృష్టి మళ్ళడంతో ప్రపంచ చమురు మార్కెట్ కొంత ఊపిరి పీల్చుకుంది. క్షిపణి దాడుల కంటే ఆర్థిక ఆంక్షలే వ్యాపారులకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయాన మార్గం ఏర్పాటుపై ఇరాన్, ఒమన్ దేశాలు చర్చలు జరపడం కూడా మార్కెట్లో ఆశలు చిగురించేలా చేసింది. అయితే, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ గనుక ప్రతిదాడికి దిగితే మాత్రం చమురు ధరలు మళ్లీ ఒక్కసారిగా మండిపోయే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications