జో బిడెన్ సర్జన్ జనరల్గా కన్నడిగ: విమానం ఎక్కుతూ తూలిపడ్డ కొద్దిరోజులకే కీలక నియామకం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తికి మరో కీలక పదవి లభించింది. ఇప్పటికే కోవిడ్ టాస్క్ఫోర్స్ వంటి కీలక స్థానాల్లో ఉన్న ఆయన తాజాగా జో బిడెన్ వ్యక్తిగత సర్జన్ జనరల్గా నియమితులయ్యారు. ఈ మేరకు యూఎస్ సెనెట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇదివరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలోనూ ఆయన యూఎస్ సర్జన్ జనరల్గా నియమితులయ్యారు. ఇటీవలే విమానం ఎక్కుతూ బిడెన్ తూలిపడటం, ఆ వెంటనే ఆయన వ్యక్తిగత సర్జన్ జనరల్గా వివేక్ మూర్తి అపాయింట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బిడెన్ వ్యక్తిగత సర్జన్ జనరల్గా వివేక్ మూర్తిని నియమించడంపై యూఎస్ సెనెట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 57 మంది సెనెటర్లు ఓటు వేశారు. ప్రతికూలంగా 47 ఓట్లు పడ్డాయి. దీనితో తీర్మానం ఆమోదించినట్లు సెనెట్ ప్రకటించింది. ఇకపై బిడెన్ సర్జన్ జనరల్గా డాక్టర్ వివేక్ మూర్తి కొనసాగుతారని పేర్కొంది. బిడెన్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే ఆయనకు కీలక పదవులు దక్కాయి.
Recommended Video
వివేక్ మూర్తి తల్లిదండ్రులు డాక్టర్ లక్ష్మీనారాయణ మూర్తి, మైత్రేయి కర్ణాటకకు చెందినవారు. తొలుత యార్క్షైర్ అనంతరం ఫ్లోరిడాలో డాక్టర్గా స్థిరపడ్డారు. యార్క్షైర్లో జన్మించిన వివేక్ మూర్తి హార్వర్డ్ యూనివర్శిటీ, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లల్లో చదువుకున్నారు. 2014లో తొలిసారిగా అమెరికా సర్జన్ జనరల్గా నియమితులయ్యారు. అప్పట్లోనూ సెనెట్లో ఓటింగ్ నిర్వహించారు. అధికారం చేతులు మారిన తరువాత మరోసారి ప్రభుత్వంలో ఆయన చోటు లభించింది. కోవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్గా కొనసాగుతున్నారు.