భారత్కు రాకముందే ట్రంప్కు భారీ ఊరట.. తాలిబన్లతో శాంతి ఒప్పందం.. 29న సంతకాలు
భారత పర్యటన ప్రారంభం కావడానికి మూడ్రోజుల ముందే.. ఆసియా వ్యవహారాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట లభించింది. 18 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ.. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రక్రియలో ఆయన దాదాపు సక్సెస్ అయ్యారు.
తాలిబన్లతో ట్రంప్ సర్కారు శాంతి ఒప్పందం చేసుకునేందుకు అంతా సిద్ధమైంది. హింస నియంత్రణ ఒప్పందం(reduction of violence deal)పై చివరిదశ చర్చలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 29న ఇరు పక్షాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు.
అమెరికా- తాలిబన్ల మధ్య చివరిదశ శాంతి చర్చలకు ఖతార్ దేశరాజధాని దోహా సిటీ వేదికైంది. శాంతి ఒప్పందంపై శుక్రవారం ప్రారంభమైన చర్చలు.. వారంపాటు కొనసాగనున్నాయి. ఈనెల 29న రెండు వర్గాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఒప్పందంలో భాగంగా తాలిబన్లు తమ సైనిక కార్యకలాపాలను తగ్గించుకుంటారు. ఇప్పటికే కొద్దిరోజుల నుంచి వారు కాల్పుల విరమణను పాటిస్తున్నారు. అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం ఖరారైన వెంటనే.. సైనికుల తరలింపు చేపట్టాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. 2017లో గద్దెనెక్కిన ట్రంప్.. అఫ్గాన్ తో యుద్ధానికి ముగింపు పలుకుతానని, నాలుగేళ్లలోపే సైనికులందరినీ స్వదేశానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు..
అమెరికాతో ఒప్పందం ఖరారైన తర్వాత తాలిబన్లు... అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. గత సెప్టెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అష్రాఫ్ ఘని దేశాధ్యక్షుడిగా విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించనప్పటికీ.. ఎన్నికలు జరిగిన విధానంపై ప్రతిపక్ష పార్టీలు, తాలిబన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చర్చలు ఎలా ముందుకెళతాయనేదానిపై ఉత్కఠ నెలకొంది.