గెలవని యుద్ధం: ఆగస్టు31తో సమాప్తం -అఫ్గానిస్థాన్ నిర్మాణం మా పనికాదు: అమెరికా జోబైడెన్ సంచలనం
అక్షరాలా 20 ఏళ్లు.. వేలాది ప్రాణాలు.. 2లక్షల డాలర్ల ఖర్చు.. చివరికి మిగిలింది శూన్యం. ఏ పరిస్థితుల్లో యుద్ధం మొదలైందో.. రెండు దశాబ్ధాల తర్వాత కూడా అవే పరిస్థితుల్లో పరిసమాప్తి కానుంది. దక్షిణాసియా దేశం అఫ్గానిస్తాన్ లో రెండు దశాబ్దాలపాటు అమెరికా చేసిన యుద్దం ఎట్టకేలకు ముగియనుంది. ఈ ఏడాది ఆగస్టు 31తో అఫ్గాన్ లో అమెరికా మిలటరీ మిషన్ పూర్తి స్థాయిలో అంతం కానుందని అధ్యక్షుడు జో బైడెన్ కుండబద్దలు కొట్టారు.

బైడెన్ కీలక ప్రకటన..
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ పేల్చివేత, రక్షణ కేంద్రం పెంటగాన్ పై బాంబుల వర్షం తదితర ఘటనల సమాహారమైన 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదుల ఏరివేత, అల్ కాయిదా చీఫ్ బిన్ లాడెన్ వేట కోసం అమెరికా 2001 అక్టోబర్ లో అఫ్గానిస్థాన్ పై యుద్ధం మొదలుపెట్టడం, అసలు లక్ష్యాలు ఎప్పుడో దారి తప్పగా, అఫ్గానేత నేలపై(పాకిస్తాన్ లో) లాడెన్ ను సైతం మట్టుపెట్టిన తర్వాత కూడా అది కొనసాగుతూ రావడం, రెండు దశాబ్దాల యుద్ధాన్ని ముగిస్తానని గత అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, ఆ దిశగా సేనలను వెనక్కి రప్పించే ప్రక్రియను వేగవంతం చేయడం తెలిసిందే. చివరికి జోబైడెన్ హయాంలోగానీ యుద్ధం అధికారికంగా ముగింపు దశకు చేరింది. అఫ్గాన్ తో యుద్ధం ముగింపుపై ప్రెసిడెంట్ జో బైడెన్ గురువారం నాడు కీలక ప్రకటన చేశారు...

ఆగస్టు 31తో యుద్ధం సమాప్తి..
అమెరికా, అఫ్గాన్ పోరును గెలవలేని యుద్ధంగా అభివర్ణించిన బైడెన్.. 20 ఏళ్ల కిందట తాము మొదలుపెట్టిన పనికి సైనిక పద్ధతిలో పరిష్కారం లభించే అవకాశమే లేదని అంగీకరించారు. ''ఇంకా ఎన్ని వేల మంది అమెరికన్ బిడ్డల ప్రాణాలను పణంగా పెట్టాలి? అఫ్గానిస్థాన్ లో మిలటరీ ఆపరేషన్ కోసం అమెరికాకు చెందిన మరో తరాన్ని కూడా నేను బలిపెట్టలేను. అందుకే యుద్ధాన్ని పూర్తి స్థాయిలో ముగించబోతున్నాను. ఆగస్టు 31తో యూఎస్-అఫ్గాన్ వార్ అధికారికంగా ముగుస్తున్నది'' అని ప్రెసిడెంట్ బైడెన్ వైట్ హౌజ్ లో ప్రకటన చేశారు. అఫ్గాన్ యుద్ధంలో అమెరికా సైనికులు 2,442 మంది చనిపోగా మరో 20,666 మంది గాయపడ్డారు. అమెరికా కాంట్రాక్టు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది 3,800 మంది, నాటో దేశాలకు చెందిన 1,144 మంది సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు. 47,245 మంది అఫ్గాన్ పౌరులు, 69 వేల మంది వరకూ అఫ్గాన్ సైనికులూ చనిపోయారు. కాగా,

అఫ్గాన్ నిర్మాణం మా పని కాదు
రెండు దశాబ్దాలపాటు అఫ్గానిస్థాన్ నేలను ఆగం చేసి, తాలిబన్లను పూర్తిగా ఏరేయకుండానే అమెరికా సేనలు వెళ్లిపోవడం అన్యాయమంటూ అఫ్గాన్ పాలకులు, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న విమర్శలకూ జో బైడెన్ సమాధానమిచ్చారు. ''మేం అఫ్గానిస్థాన్ వెళ్లింది జాతి నిర్మాణం కోసం కానేకాదు. అఫ్గాన్ భవిష్యత్తు నిర్మాణం అక్కడి నేతల చేతుల్లోనే ఉంది. ఆ దేశ సైన్యంపై నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. తాలిబన్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదు'' అని బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా సేనల నిష్క్రమణ దాదాపు చివరి దశకు చేరడంతో తాలిబన్లు మళ్లీ ఆయా ప్రాంతాలపై పట్టు బిగిస్తున్నాయి. దీంతో చాలా దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేస్తున్నాయి. 2001కి ముందులాగే అఫ్గానిస్థాన్ మళ్లీ తాలిబన్ల చెరలోకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదనే రిపోర్టులు కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications