తీరు మారని చైనా: సైబర్ అటాక్: 21 శతాబ్దంలో అతి పెద్ద సవాల్: నిప్పులు చెరిగిన అమెరికా
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనా వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. చైనా అనుసరిస్తోన్న విధానాల పట్ల అగ్రరాజ్యం అమెరికా తీవ్ర అసహనాన్ని, ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. చైనా వైఖరి.. మున్ముందు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద సవాల్గా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పేర్కొంది. ప్రపంచ దేశాల మధ్య దౌత్య సంబంధాలు, భౌగోళిక రాజకీయాల్లో చైనా తీరు.. ఓ పరీక్షలా మారిందంటూ వ్యాఖ్యానించింది. తరచూ సైబర్ దాడులకు దిగడం పట్ల నిప్పులు చెరిగింది.
అలస్కాలోని ఆంకరేజ్లో అమెరికా-చైనా జాతీయ భద్రతాధికారుల మధ్య కీలక సమావేశం ఏర్పాటైంది. యూఎస్ స్టేట్ సెక్రెటరీ ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్, చైనాకు భద్రతాధికారులు వాంగ్ యీ, యాంగ్ జేచీ ఈ భేటీకి హాజరయ్యారు. చైనా అనుసరిస్తోన్న విధానాలు ప్రపంచ దేశాలకు ఏ మాత్రం శ్రేయస్కరమైనవి కావంంటూ బ్లింకన్ ఆ దేశ భద్రతాధికారుల ముఖం మీదే తేల్చి చెప్పారు. గ్ఝిన్జియాంగ్, హాంగ్కాంగ్, తైవాన్ పట్ల చైనా వ్యవహర శైలిని ఏ దేశం కూడా సమర్థించబోదని తేల్చి చెప్పారు.
తమతో పాటు, ఎంపిక చేసుకున్న కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని తరచూ సైబర్ దాడులకు పాల్పడుతూ పరిస్థితులను ఉద్దేశపూరకంగా ఉద్రిక్తంగా మార్చుతోందని, ఇది సమర్థనీయం కాదని బ్లింకెన్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఉమ్మడిగా రూపొందించుకున్న కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలను పాటించి తీరాల్సి ఉంటుందని ఆయన సూచించారు. సైబర్ దాడులతో పాటు, గ్ఝిన్ జియాంగ్, హాంగ్కాంగ్, తైవాన్పై అనుసరిస్తోన్న వైఖరి తమ అంతర్గత అంశంగా చైనా పేర్కొనడాన్ని తప్పు పట్టారు.
తూర్పు, దక్షిణ ప్రాంత సముద్రాలు, మానవ హక్కుల ఉల్లంఘన, గ్జిన్ జియాంగ్లోని ఉయిఘుర్ ముస్లింల అణచివేత వంటి కీలకాంశాలు చైనా అంతర్గతమైనవి కావని జేక్ సుల్లివాన్ చెప్పారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం కొనసాగాలంటే.. చైనా తన తీరును, వివాదాస్పద విధానాలను పునసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచనాన్ని హింసాత్మకంగా మార్చే విధానాలను పాటించడాన్ని తాము సహించబోమని తేల్చి చెప్పారు.