భారతీయుడి పాత్ర: ఉద్యోగాల పేరిట ఆస్ట్రేలియాలో వీసా స్కాం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారీ వీసా కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ ఉద్యోగాలను ఆశచూపి విదేశీయులకు ఆస్ట్రేలియా వీసాలు, శాశ్వత నివాస హక్కు ఇప్పిస్తున్న కొన్ని కంపెనీలు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తంలో కొంత వాటాను కంపెనీ అధికారులకు, మరికొంత వాటాను ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఇస్తుండటం విశేషం.
సమారు 132 విదేశీయులు వీసాల విషయంలో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఈ వీసా కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రదారి ఓ భారతీయుడు కావడం విశేషం.
ఈ వీసా కుంభకోణంలో ఇప్పటికే 40 మంది భారతీయులు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హిందీ మాట్లాడే ఈ వ్యక్తి తనను సంప్రదించాడని, నకిలీ ఉద్యోగాలు సృష్టించి తనకు సహకరిస్తే ఒక్కో వీసాకు 5,000 డాలర్ల చొప్పున ఇస్తానని ఆశచూపాడని మాజీ మల్టీకల్చరల్ అడ్వైజర్ జస్విందర్ సిద్ధూ వెల్లడించారు.
కొద్దిరోజుల క్రితం ఈ వీసా ఫిక్సర్ ఫెయిర్ఫాక్స్ మీడియా సంస్ధ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో రహస్య కెమెరాకు దొరికాడు. తనకు సిడ్నీ, మెల్బోర్న్లలలోని పలు కంపెనీల్లో మిత్రులు ఉన్నారని, డబ్బు పారేస్తే వారు కావాల్సినన్ని నకిలీ ఉద్యోగాలు సృష్టించి తనకు సహకరిస్తారని అతడు చెప్పిన మాట కెమెరాలో రికార్డయింది.
దీంతో స్థానిక మీడియా ఈ వీసా కుంభకోణంపై పలు ఆసక్తికర కథనాలను ప్రసారం చేసింది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖలో అవినీతి చాలా తీవ్రంగా ఉందని, వందలాది కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు వీసా కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని భారత హైకమిషన్ అప్రమత్తం చేసింది.
ముఖ్యంగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులు కొన్ని ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ''ఆస్ట్రేలియా వీసా, ఇమ్మిగ్రేషన్ స్టేటస్కు సంబంధించి కొందరు నకిలీగాళ్లు భారతీయులకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తాము హైకమిషన్ లేదా కాన్సులేట్ అధికారులమని ఫోన్లో చెబుతున్నారు. ఎవరికైతే ఫోన్ చేశారో వారి గురించి మోసగాళ్లు కొంత సమాచారం తెలుసుకుంటున్నారు. అది చెప్పి మొదట వారిని నమ్మించి ఆ తర్వాత మీ పాస్పోర్టుతోను, ఇమ్మిగ్రేషన్ స్టేటస్తోనో సమస్య ఉందని భయపెడుతున్నారు. భారతీయుల నుంచి డబ్బు గుంజుతున్నారు. ఇలాంటి కాలర్స్ను నమ్మవద్దు'' అని భారత హైకమిషనర్ నవదీప్ సూరి చెప్పారు.
వీసా మోసాల గురించి తమ వెబ్సైట్ ద్వారా, ఫేస్బుక్ ఖాతా ద్వారా ఇప్పటికే భారతీయులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వీసా కుంభకోణంపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆస్ట్రేలియా పోలీసులను కోరామన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు వచ్చిన భారతీయులను లక్ష్యంగా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.
కొన్నిసార్లు ఈ మోసగాళ్లు భారత హైకమిషన్, కాన్సులేట్ ఫోన్ నంబర్ల నుంచే కాల్ వచ్చినట్టుగా మాయ చేస్తున్నారని, అందువల్ల నంబర్ను చూసి మోసపోవద్దని ఆయన ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు సూచించారు. ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ విషయంలో భారత హైకమిషన్ ఎలాంటి కాల్స్ చేదని, ఆ వ్యవహారాన్ని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ చూసుకుంటుందన్నారు.
ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయులకు ఇటువంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. నకిలీ ఉద్యోగాలను ఎర వేసి పంజాబ్ నుంచి అనేకమందిని అక్రమంగా ఆస్ట్రేలియాకు తీసుకువచ్చిన సుఖ్వంత్సింగ్ అనే వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు ఇటీవలే మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.