వాఘా వద్ద, పాక్లో ఆత్మాహుతి దాడి, 65మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.

భారత్-పాక్ల మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్ అయిన వాఘా వద్ద ప్రతి రోజూ ఇరుదేశాల సైనికులు జరిపే కవాతు ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు జరిగింది. ఇది ఆత్మాహుతి దాడి అని, కనీసం 55 మంది చనిపోగా, 200 మంది దాకా గాయపడినట్లు అధికారులు చెప్పారు.
వాఘా సరిహద్దు వద్ద రేంజర్స్ కవాతు కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత పెద్ద సంఖ్యలో జనం తిరిగి వెళ్తున్న సమయంలో బయటకు వెళ్లే గేట్లలో ఒకదాని సమీపంలో ఒక మానవ బాంబు తనను పేల్చేసుకున్నాడని పంజాబ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ముస్తాక్ సుఖేరా చెప్పారు. చనిపోయినవారిలో ముగ్గురు పాకిస్తాన్ రేంజర్స్ జవాన్లు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.
రేంజర్స్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిందని, అయితే ఆత్మాహుతి దాడులను ఆపడం కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కాగా, ఈ దాడి తామే జరిపినట్లు అల్ఖైదాకు అనుబంధంగా ఉన్న జనదుల్లా మిలిటెంట్ గ్రూపు ప్రకటించుకున్నట్లు ‘ఎక్స్ప్రెస్ న్యూస్' చానల్ తెలిపింది. మొహరం దృష్ట్యా పాక్ ప్రభుత్వం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లుచేసినప్పటికీ ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
లాహోర్కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాఘా సరిహద్దు వద్ద ప్రతి రోజూ సాయంత్రం సరిహద్దును మూసివేసే ముందు పతాకాలను అవనతం చేసే ముందు ఇరు దేశాల సైనికులు జరిపే కవాతును తిలకించడానికి పెద్ద ఎత్తున జనం చేరుతుంటారు. దశాబ్దాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. సరిహద్దు చెక్పోస్టు సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ వెలుపల ఈ పేలుడు సంభవించిందని సుఖేరా చెప్పారు.
పేలుడు జరిగిన సమయంలో వాఘా సరిహద్దు వద్ద పరేడ్ను తిలకించిన తర్వాత పెద్ద సంఖ్యలో జనం తిరిగి వెళ్తున్నారని. పేలుడు జరిగిన స్థలంలో బాల్ బేరింగ్లను కనుగొన్నారని మరో పోలీసు అధికారి చెప్పారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో చాలామంది తమ వాళ్ల జాడ తెలియక రోదిస్తూ ఆస్పత్రి సిబ్బందిని అడగడం కనిపించింది. ఘుర్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో దాదాపు డజను మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయని సజ్జాద్ చెప్పారు.
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లాహోర్ పేలుడును తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆత్మాహుతి దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్య అని ఆదివారం రాత్రి ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.
65కు చేరిన మృతుల సంఖ్య
వాఘా సరిహద్దు బాంబు పేలుడు మృతుల సంఖ్య సోమవారం 65కు చేరింది. ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మరో పదిమంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications