‘వన్నాక్రై’ ఎఫెక్ట్: పాత విండోస్ వెర్షన్లకూ సెక్యూరిటీ అప్డేట్, విడుదల చేసిన మైక్రోసాఫ్ట్
‘వన్నాక్రై’ మాల్వేర్ దాడుల నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తన విండోస్ పాత వెర్షన్ ఓఎస్లకూ కొత్త సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన 'వన్నాక్రై' మాల్వేర్ దాడుల నేపథ్యంలో సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అప్రమత్తమైంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విండోస్ పాత వెర్షన్ ఓఎస్లకూ కొత్త సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేసినట్లు వెల్లడించింది.
గతనెలలో ప్రపంచవ్యాప్తంగా 'వన్నాక్రై' అనే ప్రమాదకర మాల్వేర్తో కంప్యూటర్ వినియోగదారులను సైబర్ నేరగాళ్లు తీవ్ర కలవరానికి గురిచేశారు. దాదాపు మూడు లక్షలకుపైగా కంప్యూటర్లపై దాడి చేసి వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టారు. మన దేశంలోనూ దాదాపు 40 వేల మందికిపైగా ఆ మాల్వేర్ బారిన పడినట్లు వార్తలొచ్చాయి.
నిజానికి మూడేళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఎక్స్పీ ఓఎస్కి సాంకేతిక సహాయాన్ని నిలిపివేసింది. 2014 ఏప్రిల్ 8 నుంచి విండోస్ ఎక్స్పీకి ఎలాంటి భద్రతాపరమైన అప్డేట్లు విడుదల చేయబోమని ప్రకటించింది.
కంప్యూటర్లలో ఎక్స్పీని వినియోగిస్తున్న వారంతా కొత్త వెర్షన్లకు అప్డేట్ అవ్వాలని సూచించింది. కానీ.. ఇప్పటికీ దాదాపు 7 శాతం కంప్యూటర్లలో ఆ ఓఎస్ను వినియోగిస్తున్నారు.
'వన్నాక్రై' దాడులు కూడా విండోస్ పాత వెర్షన్ ఓఎస్లతో పనిచేస్తున్న కంప్యూటర్లపైనే అధికంగా జరుగుతున్నాయని సెక్యూరిటీ నిపుణులు ఇటీవల హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన నిబంధనలను సడలించింది.
విండోస్ ఎక్స్పీ వెర్షన్కూ సెక్యూరిటీ అప్డేట్ను విడుదల చేసింది. ఓఎస్ లోని మొత్తం 94 లోపాలను సవరించినట్లు వెల్లడించింది. మరి .. మీరూ ఇప్పటికీ మీ కంప్యూటర్ లో విండోస్ ఓఎస్ వాడుతుంటే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోండి.