అమెరికా- ఇరాన్ మధ్య భీకర దాడులు.. అగ్నిగుండంలా మారిన పశ్చిమాసియా..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య పరస్పర దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కాల్పుల విరమణ ముగిసిన కొద్దిసేపటికే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ గార్డ్ కార్ప్స్ వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. అలాగే ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ మిసైల్, ఓ వార్ ఫేర్ డ్రోన్ ను కూల్చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వీటితో పాటు సౌత్ ఇరాన్ లోని కీలకమైన బందర్ అబ్బాస్, సిరిఖ్, కేశ్మ్, జాస్క్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ స్పష్టం చేసింది.
మరోవైపు అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాల్లోని అమెరికన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసిన కారణంగానే అమెరికా సైన్యం దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇరాన్ లోని 140 స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఆ తర్వాత ఇరాన్ సైతం అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది. ఇక హార్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధి ఓపెన్ గా ఉందని అన్నారు. కానీ ఇరాన్ కు చెందిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ మాత్రం హార్మూజ్ లో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకూ ఎలాంటి రవాణా, వాణిజ్య రాకపోకలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్, ఖతార్ దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు మరోసారి ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు ప్రారంభించేందుకు ఖతార్ ప్రతినిధులు ఇరాన్ లో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం అవుతోంది. అటు పాకిస్థాన్ కూడా.. ఇరు దేశాలు కాస్త సంయమనం పాటించాలని, ఒప్పందం అమలు దిశగా అమెరికా- ఇరాన్ సహకరించాలని కోరింది.

ఇక ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు విపత్కర పరిణామాలకు దారి తీస్తాయని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications