అభినందన్ వర్థమాన్కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
2019 ఫిబ్రవరిలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్, పాకిస్తాన్కు చెందిన ఎఫ్16 ఫైటర్ జెట్ను కూల్చివేశారనే భారత వాదనలను పాకిస్తాన్ మరోసారి తోసిపుచ్చింది.
2019లో పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్ వర్థమాన్ను భారత ప్రభుత్వం వీర్ చక్ర పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
అభినందన్ ధైర్యసాహసాల గురించి భారత్లో ప్రశంసిస్తున్నారు. మరోవైపు భారత వాదనపై పాకిస్తాన్ ప్రశ్నలు సంధించింది.
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎస్ దళాలపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఇది జరిగిన సుమారు రెండు వారాల తర్వాత, ఫిబ్రవరి 26న వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి వెళ్లి, బాలాకోట్లోని జైష్ ఎ మొహమ్మద్ స్థావరాలపై, శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసినట్లు భారత్ ప్రకటించింది.
ఆ తర్వాత రోజే పాకిస్తాన్ వైమానిక దళం, భారత భూభాగంలోకి ప్రవేశించి కాల్పులు జరిపింది. ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విమానం కూలిపోవడంతో, పారాచూట్ సహాయంతో ఆయన భారత సరిహద్దు దాటి పాకిస్తాన్లో దిగారు. అక్కడే పాకిస్తాన్ భద్రతాదళాలు ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. రెండు రోజుల అనంతరం, మార్చి1న పాక్ సైన్యం ఆయన్ను తిరిగి భారత అధికారులకు అప్పగించింది.
భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తన మిగ్-21 విమానంతో పాకిస్తాన్కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశారని భారత సైన్యం పేర్కొంది.
పాకిస్తాన్ ఏం చెప్పింది?
భారత్ చేసిన ఈ వాదనపైనే పాకిస్థాన్ తాజాగా స్పందించింది. గతంలో కూడా ఈ వాదనను పాకిస్తాన్ ఖండించింది.
''పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని భారత ఫైలట్ కూల్చివేశారని భారత్ చేస్తోన్న నిరాధారమైన వాదనను పాకిస్తాన్ ఖండిస్తోంది'' అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
''పాకిస్తాన్కు చెందిన అన్ని ఎఫ్-16 విమానాలను పరిశీలించిన తర్వాత, ఆరోజు పాకిస్తాన్కు చెందిన ఎఫ్-16 విమానం నేలకూలలేదని అంతర్జాతీయ నిపుణులు, అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించారు''
''తమ ప్రజలను సంతోషపెట్టడానికి, అవమానాలను దాచుకోవడానికి అల్లిన తప్పుడు, కట్టుకథలకు భారత్ చేస్తోన్న వాదనలు సరైన ఉదాహరణలు''
''ఇలా 'కల్పిత పరాక్రమాలకు' మిలటరీ గౌరవాలు ఇవ్వడం అనేది ఆర్మీ నియమ నిబంధనలకు, విలువలకు విరుద్ధం. ఈ గౌరవం ఇవ్వడం ద్వారా భారత్ తనను తాను అపహాస్యం చేసుకుంటోంది''
''భారత్ శత్రు వైఖరి ప్రదర్శిస్తూ, తప్పుడు దారిలో దూకుడుగా వ్యవహరించిన్పటికీ... పైలట్ (అభినందన్ వర్థమాన్)ను విడుదల చేయడం అనేది శాంతిని కాపాడాలనే పాకిస్తాన్ కోరికకు నిదర్శనం'' అని అభినందన్ను భారత్కు అప్పగించడం గురించి ఆ ప్రకటనలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
''2019 ఫిబ్రవరి 27న, భారత్కు చెందిన రెండు విమానాలను పాకిస్తాన్ వాయుసేన కూల్చివేసింది. అందులో ఒకటి మిగ్-21 బైసన్. అందులోని పైలట్ను పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. సుఖోయ్ 30 ఎంకేఐ అనే మరో భారత విమానాన్ని కూడా పాకిస్తాన్ వాయుసేన కూల్చింది. అది భారత భూభాగంలో పడిపోయింది. తర్వాత అదేరోజు తమ హెలికాప్టర్ను శ్రీనగర్ సమీపంలో భారత్ పొరపాటున ధ్వంసం చేసుకుంది. తొలుత ఈ విషయాన్ని భారత్ ఒప్పుకోలేదు. కానీ తర్వాత అంగీకరించింది'' అని ప్రకటనలో పాకిస్తాన్ పేర్కొంది.
పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చాక అభినందన్ మళ్లీ విమానం నడిపించడంపై అనేక భయాలు ఉండేవి. కానీ మళ్లీ ఆరు నెలల వ్యవధిలోనే ఆయన విమానాన్ని నడిపించారు. ఆయనకు గ్రూప్ కెప్టెన్గా ప్రమోషన్ కూడా లభించింది.
భారత వాయుసేనకు చెందిన ఫైటర్ పైలట్ ప్రదర్శించిన అసాధారణ కర్తవ్య బాధ్యతల దృష్ట్యా ఆయనకు భారత మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన 'వీర్ చక్ర' పతకాన్ని అందజేస్తున్నట్లు వీర్ చక్ర ప్రశంసా పత్రం పేర్కొంది.
''వింగ్ కమాండర్ (ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్థమాన్ను రాష్ట్రపతి కోవింద్ వీర్ చక్ర పురస్కారంతో గౌరవించారు. ఆయన తన వ్యక్తిగత భద్రతను పట్టించుకోకుండా, శత్రువుల వద్ద వీరత్వాన్ని, సాహసాన్ని ప్రదర్శించారు. విధి నిర్వహణలో అసమాన కర్తవ్యాన్ని ప్రదర్శించారు'' అని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
అభినందన్ను వీర్ చక్ర పురస్కారంతో గౌరవించాలని 2019లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సామాజిక మాధ్యమాల్లో చర్చ
అభినందన్ వీర్ చక్ర అవార్డును స్వీకరించిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్, పాకిస్తాన్లకు చెందిన యూజర్లు తమ తమ దేశాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ పురస్కారం అభినందన్కు ఇవ్వడం పట్ల, భారత వాదనల పట్ల పాకిస్తాన్ సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నలు లేవనెత్తుతుండగా, భారత మద్దతుదారులు అభినందన్ ధైర్యసాహసాల పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాకిస్తాన్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరీ అభినందన్ పట్ల వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
''నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు, నేనేం చేశాను' అని అభినందన్ మనసులో అనుకుంటున్నారు. భారత రాష్ట్రపతి భవన్లో కామెడీ చిత్రాన్ని నిర్మించారు'' అని ఆయన ట్వీట్ చేశారు.
''మీ విమానాన్ని మీరే ముక్కలుగా ధ్వంసం చేసుకున్నారు. మళ్లీ యుద్ధ ఖైదీగా మారినందుకు సన్మానాలు పొందారు'' అని జర్మనీలో పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ ఫైజల్ వ్యాఖ్యానించారు.
''పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని నేలకూల్చినందుకు కాదు.. అసలు అలాంటి ఘటనే జరగలేదు. కానీ ప్రాణ భయం లేకుండా అభినందన్ శత్రుదేశపు గగనతలంలోకి చొచ్చుకువచ్చినందుకు ఆయన ఈ పురస్కారం పొందడానికి అర్హుడు. అతన్ని గౌరవించడం సముచితమే. శత్రువులను ఎల్లప్పుడూ గౌరవించాలి'' అని మరో పాకిస్తాన్ యూజర్ పేర్కొన్నారు.
''పాకిస్తాన్ ఎఫ్-16 జెట్ను కూల్చివేసినందుకు గానూ, భారత ఫైటర్ పైలట్ ఈరోజు మిలటరీ గౌరవాన్ని అందుకున్నారు. కానీ అలాంటిదేదీ జరగలేదని యూఎస్ అధికారులు నిర్ధారించారు'' అని ఆసియా ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మన్ వ్యాఖ్యానించారు.
''పారిశ్రామిక కారణాల రీత్యా అమెరికా ఇలా ఎందుకు పేర్కొంటుంది? కానీ మీరేమో రెండు భారత విమానాలను నేలకూల్చాం. ఇద్దరు పైలట్లను అరెస్ట్ చేశాం అని చెప్పారు. ఆ వ్యాఖ్యలు మిమ్మల్నే ఎదురుదెబ్బ తీశాయి'' అని ఒక భారతీయ యూజర్ రాసుకొచ్చారు.
అభినందన్కు మద్ధతుగా చాలా మంది ట్వీట్లు చేశారు.
ఎఫ్ 16 నేలకూలిందా?
2019 ఏప్రిల్లో అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక మ్యాగజైన్ 'ఫారిన్ పాలసీ' ఒక కథనంలో "యూఎస్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను లెక్కించారు. వాటి సంఖ్య సరిగ్గానే ఉంది'' అని పేర్కొంది.
ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ప్రకారం, నియంత్రణ రేఖ వద్ద పోరాటంలో ఎఫ్-16 విమానాలను ఉపయోగించారు. ఏఐఎం 20 క్షిపణులను కూడా ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఆత్మరక్షణ కోసం పాకిస్తాన్ భూభాగం నుంచి ప్రయోగించారా? లేక కశ్మీర్లో ప్రయోగించారా అనే అంశంలో స్పష్టత లేదు.
"సత్యమే ఎప్పుడూ గెలుస్తుంది. ఇదే ఉత్తమ విధానం కూడా. యుద్ధం యొక్క ఉన్మాదాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పాకిస్తాన్ ఎఫ్ -16 ఫైటర్ జెట్ను కూల్చివేశామని అబద్ధం చెబుతోంది. కానీ వారికి ఇది ఎదురుదెబ్బే. ఎందుకంటే పాకిస్తాన్ ఎఫ్-16 విమానాల సంఖ్య సరిగ్గానే ఉన్నట్లు అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించారు" పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
- త్రిపుర: ఈ రాష్ట్రంలో మత ఘర్షణల వెనుక అసలు నిజాలేంటి - బీబీసీ పరిశోధన
- అద్భుతం: చికిత్స లేకుండానే హెచ్ఐవీ వైరస్ను తరిమేసిన మహిళ శరీరం
- ఆంధ్రప్రదేశ్: శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం
- ఒత్తిడి తట్టుకోవడానికి గంజాయిని ఆశ్రయిస్తున్న అమ్మలు, ఇది ఆరోగ్యానికి ప్రమాదం కాదా
- మంటల్లో చిక్కుకున్న బస్సు, 45 మంది మృతి
- వైఎస్ జగన్: 'అమరావతి ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ ఇక్కడే ఉంది’
- 44 ఏళ్ల వయసులో ఐఐఎంలో రెండు బంగారు పతకాలు సాధించిన విశాఖ గృహిణి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)