రహస్యంగా అక్కడికెళ్లిన కిమ్: ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు, అమెరికాకు దడ..
అణ్వాయుధాల ఉత్పత్తులను పెంచాలని వారికి ఆదేశాలు జారీ చేయడంతో అమెరికా ఆందోళన చెందుతోంది.
ప్యోంగ్ యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ రహస్యంగా ఆ దేశ సైనిక స్థావరాలను సందర్శించడం ఆందోళన రేకెత్తిస్తోంది. యుద్ద సన్నాహాల్లో భాగంగా అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచమని సైన్యానికి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నో డౌట్, అది నిజమే.. అమెరికాకు డేంజర్ బెల్స్: ఉ.కొరియాపై ఇంటలిజెన్స్ హెచ్చరిక
ఉత్తరకొరియా-దక్షిణ కొరియా సరిహద్దులోని తమ సైనిక స్థావరంలో కొన్నాళ్లుగా కిమ్ జాంగ్ రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో యుద్దం దిశగా ముందుకెళ్లడానికి అన్నివిధాలా సిద్దంగా ఉండమని చెప్పడానికే కిమ్ ఈ రహస్య టూర్ ప్లాన్ చేశారని చెబుతున్నారు.
ఉత్తరకొరియా ప్రధాన మీడియా కొరియన్ న్యూస్ ఏజెన్సీ వెలువరించిన వివరాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా ఆధీనంలోని గువాంపై దాడి చేసేందుకు అన్నివిధాలా సిద్దంగా ఉండాలంటూ కిమ్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
శాంతి చర్చల దిశగా:
ఉత్తరకొరియా-అమెరికా మధ్య సమీప భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని అమెరికా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టిల్లర్ సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన రెండు వారాల నుంచి ఉత్తరకొరియా సంయమనంతో వ్యవహరించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిస్థితి త్వరలోనే రెండు దేశాల మధ్య చర్చలకు దారి తీస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.
అణ్వాయుధాలు పెంచాలని:
అమెరికా తీరు శాంతి చర్చల దిశగా సాగుతుంటే.. ఉత్తరకొరియా మాత్రం యుద్దానికే మొగ్గు చూపుతున్న వైఖరి కనిపిస్తోంది. కిమ్ జాంగ్ రహస్యంగా ఆ దేశ సైనిక స్థావరాలను సందర్శించి రాకెట్ ఇంజన్స్, రాకెట్ వార్ హెడ్స్ టిప్స్ ఉత్పత్తులను పెంచాలని ఆదేశాలివ్వడం ఇందుకు నిదర్శనం. కిమ్ వైఖరితో అమెరికాలో మరోసారి ఆందోళన మొదలైంది. డిఫెన్స్ అకాడమీకి చెందిన మెటీయరిల్ ఇనిస్టిట్యూట్ లో కిమ్ దీనికి సంబంధించిన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఐరాస నివేదిక, ఆందోళన చెందేలా..:
ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 37 పేజీల నివేదిక అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తరకొరియా రసాయన ఆయుధాలు తయారుచేసుకుంటుందని అందులో పేర్కొనడం ఈ ఆందోళనకు కారణం.
ఉత్తరకొరియా ఎగుమతులు దిగుమతులపై ఐరాస ఆంక్షలు విధించడంతో చైనా నుంచి ఉత్పత్తులు నిలిచిపోయాయి. దీంతో సిరియా నుంచి ఆ దేశం రెండు పడవల్లో రసాయన దాడులకు అవసరమైన సామాగ్రిని దిగుమతి చేసుకుందని ఐక్యరాజ్య సమితి అంతరంగిక భద్రతా మండలి నివేదికలో వెల్లడించింది.
ఇవీ ఆధారాలు:
సిరియా నుంచి ఉత్తరకొరియాకు రసాయన సామాగ్రి వచ్చిందని ధ్రువీకరించేలా కొన్ని ఆధారాలను కూడా ఐరాస వెల్లడించింది.సిరియా నుంచి ఈ రసాయనాలను ఉత్తరకొరియా మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో రప్పించుకుందని తెలిపింది.
ఈ సంస్థ లావాదేవీలను 2009లోనే ఐక్యరాజ్యసమితి నిషేధించినప్పటికీ.. నేటికి అక్రమంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 2013లో రష్య, అమెరికాలు రసాయన ఆయుధాలు రూపొందించకుండా చూడాలని సిరియాకు ఆదేశాలు కూడా జారీ చేశాయి. అయినా సిరియా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంది. తత్ఫలితంగానే అక్కడ ఐసిస్ బలపడుతూ వచ్చింది. ఇప్పుడు ఉత్తరకొరియాకు కూడా సిరియా నుంచే రసాయన సామాగ్రి తరలుతుండటం అమెరికాను కలవరపెడుతోంది.