అమెరికాలో థర్డ్వేవ్?: బిడెన్ ఇంట్లో తిష్టవేసిన కరోనా: వైట్హౌస్ అధికారి..స్పీకర్ సిబ్బందికీ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభించేలా కనిపిస్తోంది. థర్డ్వేవ్ ముంచుకొస్తోందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో- పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. ఈ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా అమెరికా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. అత్యధిక మరణాలు, పాజిటివ్ కేసులు రికార్డయింది ఇక్కడే. పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర కోట్లను దాటిపోయింది. 3,50,81,719లకు చేరింది. ఇప్పటిదాకా 6,25,363 మంది మరణించారు. కొద్దిరోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం కలవరపరుస్తోంది.
వైట్హౌస్ అధికారికి..
ఈ పరిణామాలన్నీ కరోనా వైరస్ థర్డ్వేవ్ను సూచిస్తోన్నాయనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా- అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ వరకూ పాకింది కరోనా వైరస్. వైట్హౌస్లో పనిచేసే అధికారికి సోకింది. అలాగే హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ సిబ్బంది ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. కిందటి వారం టెక్సాస్ లెజిస్లేచర్ సమావేశానికి హాజరైన అనంతరం పెలోసీ సిబ్బందిలో ఒకరికి వైరస్ సోకినట్లు తేలిందని స్పీకర్ అధికారిక ప్రతినిధి డ్రివ్ హ్యామ్మిల్ తెలిపారు. వైరస్ సోకిన ఉద్యోగి.. ఈ మధ్యకాలంలో స్పీకర్ను కలవలేదని వివరించారు. స్పీకర్ పెలోసీకి వైద్యపరీక్షలను నిర్వహించాల్సి ఉందని అన్నారు.
రూఫ్టాప్ రిసెప్షన్..
కాగా వైట్హౌస్లో పనిచేసే అధికారికి కరోనా వైరస్ సోకిందని ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకీ తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ అధికారిని ఐసొలేషన్లో ఉంచిన్నట్లు చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ఆయనకు వైరస్ సోకిందని స్పష్టం చేశారు. టెక్సాస్లో నిర్వహించిన రూఫ్టాప్ రిసెప్షన్కు హాజరైన తరువాత ఆ అధికారి వైరస్ బారిన పడినట్లుగా భావిస్తున్నామని అన్నారు. ఒకరి కంటే ఎక్కువ మందికి వైరస్ సోకిందా? అనే ప్రశ్నకు పిసాకీ సమాధానం ఇవ్వలేదు. కొన్ని నిబంధనల కారణంగా- ఆ విషయాన్ని వెల్లడించలేమని స్పష్టం చేశారు.
పరిమితంగానే అయినా.. అప్రమత్తం..
వైట్హౌస్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని పిసాకీ చెప్పారు. అధ్యక్షుడి మొదలుకుని కిందిస్థాయి ఉద్యోగి వరకూ అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్య నామమాత్రంగా ఉందని సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ తెలిపింది. వైట్హౌస్ స్థాయి అధికారి, హౌస్ స్పీకర్ సిబ్బందికి వైరస్ సోకడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. దీన్ని థర్డ్వేవ్గా గుర్తించలేమని, అయినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
Recommended Video
ఆరుమంది డెమొక్రాట్లకూ..
టెక్సాస్ రూఫ్టాప్ రిసెప్షన్కు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా హాజరయ్యారు. డెమొక్రటిక్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది లెజిస్లేచర్లు, హౌస్ మెంబర్లు దీనికి హాజరయ్యారు. స్పీకర్ న్యాన్సీ పెలోసీ సిబ్బంది, వైట్హౌస్ అధికారి సహా ఇందులో పాల్గొన్న ఆరుమంది డెమొక్రటిక్ లెజిస్లేచర్లు సైతం కరోనా బారిన పడ్డారు. ఈ రిసెప్షన్కు హాజరైన ఓ నర్సుకు కూడా వైరస్ సోకినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. ఆ రిసెప్షన్కు హాజరైన వారందరూ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయినప్పటికీ- వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోందని, ఇప్పటిదాకా అనుసరించిన కోవిడ్ ప్రొటోకాల్స్ను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితిని కల్పించినట్టయిందని మీడియా పేర్కొంది.