అందరూ హ్యాండిచ్చినట్టే: రష్యా అంటే భయం: ఒంటరి పోరాటం చేస్తాం: ఉక్రెయిన్ అధ్యక్షుడి నిర్వేదం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఊహించినట్టే యుద్ధం ఆరంభమైంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడు చూస్తోంటే ఉక్రెయిన్ను తన దారికి తెచ్చుకునేంత వరకూ యుద్ధాన్ని కొనసాగించేలా ఉన్నారు. తొలి రోజు- ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టే. ఉక్రెయిన్కు చెందిన కొన్ని కీలక పట్టణాలు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. రష్యా సైనికులు వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి చెందిన 74 టార్గెట్లను ఛేదించినట్లు రష్యా ప్రకటించింది.
Recommended Video
తొలిరోజు భారీగా ప్రాణనష్టం: ఉక్రెయిన్: అంతుచిక్కని పుతిన్ స్ట్రాటజీ: రష్యాలో నిరసనలు..అరెస్టులు
తీవ్రంగా నష్టపోయినట్టే..
తొలి రోజు రష్యా ఉక్రెయిన్కు చెందిన 11 ఎయిర్ఫీల్డ్స్, 18 రాడార్ స్టేషన్లు, మూడు కమాండ్ పోస్టులను ధ్వంసం చేసింది. ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థ సహా ఉక్రెయిన్ సైన్యానికి చెందిన కీలక పోస్టులపై బాంబుల వర్షాన్ని కురిపించినట్లు పేర్కంది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కొనషెన్కోవ్ తెలిపారు. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామనీ స్పష్టం చేశారు.
ఒంటరిగానే పోరాటం..
ఈ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. తన దేశ ప్రజలను ఉద్దేశించిన మాట్లాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. రష్యాతో తాము ఒంటరి పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒంటరిగా పోరాడటానికి భయపడట్లేదని అన్నారు. ఇతర దేశాల సహాయ, సహకారాలు లేకుండా తమ దేశాన్ని తాము కాపాడుకుంటామని, సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు.
కలిసి వచ్చేవారు కనిపించట్లేదు..
రష్యాను నిలువరించడానికి.. ఆ దేశాన్ని ఢీ కొట్టడానికి తమతో కలిసి వచ్చే దేశాలు ఏవీ కనిపించట్లేదని వొలొదిమిర్ అన్నారు. తమతో కలిసి వచ్చే వారు ఎవరు ఉన్నారని, అలా వచ్చే వారెవరూ తనకు కనిపించట్లేదని వొలొదిమిర్ స్పష్టం చేశారు. అందరూ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో తమ దేశానికి సభ్యత్వం ఇవ్వడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. దీనికి ఎవరూ ముందుకు రావట్లేదని చెప్పారు. అందరూ భయపడుతున్నారని తేల్చేశారు.
విధ్వంసకారులు..
రష్యా సైనికుల ముసుగులో విధ్వంసకారులు (Sabotage group) తమ దేశంలోకి ప్రవేశించారని వొలొదిమిర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని కీవ్లో అన్ని చోట్ల వ్యాపించారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దేశంలో కర్ఫ్యూ వాతావరణం ఉందని, విధ్వంసకారులు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని రష్యా సైనికులు ఈ దాడులు సాగిస్తోన్నారని చెప్పారు. రాజకీయంగా పైచేయి సాధించడానికి తనను బంధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
దేశంలోనే ఉన్నాను..
తాను దేశం విడిచి వెళ్లినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని వొలొదిమిర్ స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని చెప్పారు. తన కుటుంబంతో సహా ఉక్రెయిన్లోనే ఉన్నానని పేర్కొన్నారు. టార్గెట్ వన్ (దేశాధ్యక్షుడు)ను ఛేదించడమే రష్యా మిలటరీ లక్ష్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడిని లొంగదీసుకోవడం ద్వారా సైన్యాన్ని మానసికంగా బలహీనపర్చాలనేది రష్యా వ్యూహమని, అది సాధ్యం కాదనీ వొలొదిమిర్ స్పష్టం చేశారు.