దాహం వేయకున్నా నీళ్లు ఎందుకు తాగాలి?
నీళ్లు ఎక్కువగా తాగండి.
డాక్టర్లు తరచూ చెప్పే మాట ఇది.
కానీ చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు.
దాహం వేసినప్పుడు మాత్రమే కొద్దిగా నీళ్లు తాగుతారు.
కానీ దాహం వేయకున్నా నీళ్లు తాగాలి. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
ఈ కథనం పూర్తిగా చదివితే దాహం వేయకపోయినా ఎందుకు నీళ్లు తాగాలో మీకు అర్థమవుతుంది.
అదెంత ముఖ్యమో కూడా తెలుస్తుంది.
1. శరీరంలో స్థిరమైన నీటి సమతౌల్యం
మన శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.
శరీరంలో నీటి సమతుల్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
దాని కోసం మన శరీరంలో ఒక చక్కటి వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ మనం తాగే నీటిలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఓవరాల్గా శరీరంలోని నీటి స్థాయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది.
తక్కువ నీరు తాగినప్పుడు రెండు యంత్రాంగాలు యాక్టీవ్ అవుతాయి.
అందులో ఒకటి మూత్రపిండాలు. ఇవి మూత్రం ద్వారా నీటి నష్టం జరగకుండా అడ్డుకుంటాయి.
మరొక వ్యవస్థ మనకు దాహం కలిగించేలా ప్రేరేపిస్తుంది.
'శరీరం నీరు పట్టింది. అందుకే బరువు పెరిగిపోతున్నాను' అని చాలా మంది చెప్పడం మనం వినే ఉంటాం.
కానీ శరీరంలో నీరు చేరి బరువు పెరగడం అనేది సాధారణంగా జరగదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ శరీరంలో ద్రవాలు నిల్వ ఉంటున్నట్లు అనుమానం వస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
అతిగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు.
అతిగా నీళ్లు తాగడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
శరీరంలో అధికంగా ఉన్న నీటిని మూత్రపిండాలు మూత్రం రూపంలో బయటకు పంపిస్తూ ఉంటాయి.
మూత్రపిండాలు గంటకు 0.7 నుంచి 1 లీటర్ వరకు మూత్రాన్ని బయటకుపంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
https://www.youtube.com/watch?v=XO7zDhpPiBE
2. డీహైడ్రేషన్తో అనారోగ్యం
డీహైడ్రేషన్కు, కొన్ని వ్యాధులకు ప్రత్యక్ష సంబంధం ఉందని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా జీర్ణాశయ, మూత్రాశయ, ప్రసరణ వ్యవస్థ, నరాల సంబంధిత వ్యాధులకు డీహైడ్రేషన్ కారణమవుతుంది.
అయితే, చాలా కేసుల్లో దీనికి సంబంధించిన ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయి.
తక్కువ నీళ్లు తాగే అలవాటున్న వారిలో భవిష్యత్లో గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
నీళ్లు తక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొంటున్నాయి.
తగినంతగా నీళ్లు తాగని వాళ్లలో స్థూలకాయం సమస్య ఎక్కువుగా ఉందని 2016లో అమెరికాలో చేసిన ఒక విస్తృత అధ్యయనంలో తేలింది.
అలాంటి వారిలో బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
జీవక్రియ సంబంధింత సమస్యలకు తక్కువ నీరు తాగడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని అనేక రకాల అధ్యయనాలు చెబుతున్నాయి.
వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరం కోల్పోయే నీరు మన శరీర పనితీరుపై ప్రతీకూల ప్రభావం చూపిస్తుంది.
మనం తీసుకోవల్సిన దానికన్నా తక్కువ పరిమాణంలో ద్రవాలు తీసుకుంటున్నప్పుడు మెదడు పనితీరు కూడా కాస్త మందగిస్తుందని తేలింది.
డీహైడ్రేషన్ అనేది ప్రజల్ని తక్కువ అప్రమత్తంగా, అలసటగా ఉండేలా చేస్తుందని 21 అధ్యయనాలు విశ్లేషించినట్లు 2015లో ప్రచురితమైన ఒక సమీక్ష తెలిపింది.
- 'ఏనుగులను హింసించి చంపేస్తారు, ఆ తర్వాత మొసలి కన్నీళ్లు పెడతారు...''
- రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు
3. మంచి హైడ్రేషన్ ఉండాలంటే ఏం చేయాలి?
శరీరానికి అవసరమైనంత నీళ్లు జనం తాగడం లేదని స్పెయిన్, లాటిన్ అమెరికా దేశాల్లో చేసిన పలు అధ్యయనాల్లో తేలింది.
దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం మంచిదే.
అలా చేయడం సులువే అనిపిస్తుంది. కానీ చాలా మందికి దాహం అవుతోందన్న విషయమే తెలియదు. వారు దానిపై దృష్టి పెట్టరు. లేదంటే వారు దాన్ని అసలు గుర్తించలేకపోవచ్చు కూడా.
అందుకే చిన్నప్పటి నుంచే సరిపడా నీరు తాగే అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
వృద్ధుల్ని కూడా నీళ్లు బాగా తాగేలా ప్రోత్సహించాలి.
మనం రోజూ 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని వివిధ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి.
వేసవి కాలంలో లేదా వ్యాయామం చేసే సమయంలో మనం తాగే నీటి స్థాయిని మరింత పెంచాలి.
ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం కంటే కూడా రోజంతా కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు నీళ్లు తాగడం మంచిది.
శరీరం నీటిని శోషించుకోవడానికి ఇదే ఉత్తమ మార్గం.
https://www.youtube.com/watch?v=l3L14JpcYUA
తగినంత నీటి శాతాన్ని పొందడానికి మరో ముఖ్యమైన దారి కూడా ఉంది.
కూరగాయలు, ఆకుపచ్చని ఆకుకూరలు, పండ్లను తినడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో 80 శాతం నీరే ఉంటుంది.
చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పానీయాలు ఎక్కువగా తీసుకోకూడదు.
వాటివల్ల స్థూల కాయంతో పాటు ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
చక్కెర పదార్థాలు కలిపిన పానీయాలు సేవించడం ఆమోదయోగ్యం కాదు. చక్కెర పదార్థాలతో కూడిన ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి కావని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధారించాయి.
'తియ్యటి ఫ్లేవర్లతో ఉన్న ఆహార పదార్థాలు తినే అలవాటు వల్ల చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం, పానీయాలు తాగడం అలవాటవుతుంది' అని అవి చెప్పాయి.
ఎంత నీరు తాగాలనే విషయాన్ని నిర్ధారించే అధ్యయనాలు చాలా తక్కువగా జరిగాయన్నది నిజం.
కానీ శరీరానికి అవసరమైనంత నీరు తాగడం చాలా ముఖ్యం.
అది కూడా ఒకేసారి ఎక్కువగా తాకకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తాగాలి. అలాగని మరీ అతిగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: 'నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)