బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల విషయంలో భారత్ ఎందుకు ఆచితూచి వ్యహరిస్తోంది
బంగ్లాదేశ్లో హిందువుల ఆలయాలు, ఇళ్లపై వరుస దాడుల అనంతరం, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రుంగ్లా తొలిసారి మాట్లాడారు.
రెండు దేశాల సంబంధాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ ద్వైపాక్షిక బంధాలు అంతర్జాతీయ సమాజానికి ''రోల్ మోడల్’’గా నిలుస్తాయని అన్నారు.
1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరుపడటంలో భారత వైమానిక దళం పాత్రపై శనివారం ఆయన ప్రసగించారు.
''పాకిస్తాన్ సైనిక చిత్రహింసలకు వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ కోసం చాలా మంది భారతీయులు ప్రాణత్యాగం చేశారు’’ అని ఆయన అన్నారు.
గోల్డెన్ విజయ్ వర్ష కాన్క్లేవ్-2021లో హర్షవర్ధన్ మాట్లాడారు.
''ప్రపంచ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య బంధాల కంటే భారత్-బంగ్లాదేశ్ బంధాలు లోతైనవి. ఇవి ప్రపంచ దేశాలకు 'రోల్ మోడల్’గా నిలుస్తాయి. బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పెనవేసుకున్న స్నేహబంధాలు, పరస్పర సహకారం, అవగాహన ఇప్పటికీ కొనసాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
- బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు, భారత్ వ్యతిరేక ప్రదర్శనలు ఎందుకు జరుగుతున్నాయి?
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
దాడుల ప్రస్తావన లేదు..
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడుల గురించి హర్షవర్ధన్ ప్రస్తావించలేదు. దీన్నిబట్టి, బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోందని అర్థమవుతోంది.
బంగ్లాదేశ్లోని కుమిల్లా, చిట్గావ్, నోవాఖలీ, రంగ్పుర్లలో హిందువులపై దాడులు మొదలైనప్పుడు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు. హింసను ప్రేరేపిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ను ఆయన కోరారు.
అయితే, ఈ దాడుల పట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దాడుల అనంతరం బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి అక్కడి ప్రధాన హిందూ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే, ఈ సమావేశ వివరాలు చాలా గోప్యంగా ఉంచారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో బంగ్లాదేశ్తో సంబంధాలు మరింత బలపడ్డాయని హర్షవర్ధన్ శనివారం చెప్పారు. బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ఆయన వివరించారు.
''భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో బంగ్లాదేశ్ ఒకటి. దక్షిణాసియాలో అయితే, అతిపెద్ద భాగస్వామి బంగ్లాదేశ్. ఆసియా ఆర్థిక అభివృద్ధిలో రెండు దేశాల మధ్య బంధాలు చాలా కీలకం’’ అని ఆయన అన్నారు.
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- భారత్-పాకిస్తాన్ వార్ (1971): యుద్ధభూమిలో తన కాలును తానే నరికేసుకున్న భారత మేజర్
విమర్శలకు దూరంగా
హర్షవర్ధన్ ప్రకటనను చూస్తుంటే, హిందువులపై దాడుల విషయంలో బంగ్లాదేశ్ను మోదీ ప్రభుత్వం విమర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
బంగ్లాదేశ్తో సంబంధాలు గాడి తప్పకూడదని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది.
బంగ్లాదేశ్తోపాటు పొరుగున్న దేశాల్లో హిందువులు, ఇతర మైనారిటీలకు ఆశ్రయం ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్లో చాలా హైప్రొఫైల్ ప్రాజెక్టుల్ని చైనా చేపడుతోంది. గత గురువారం బంగ్లాదేశ్-చైనా ఫ్రెండ్షిప్ ఎగ్జిబిషన్ సెంటర్ను ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రారంభించారు. ఢాకా శివార్లలో 26 ఎకరాల్లో ఈ సెంటర్ను ఏర్పాటుచేశారు. బంగ్లాదేశ్, చైనాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక బంధాలకు ఈ సెంటర్ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఉత్తర, దక్షిణ బంగ్లాదేశ్లను అనుసంధానించే ఓ వంతెనను 2018లో నిర్మించారు. ఆరు కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన రెండు ప్రాంతాలను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానిస్తోంది. బంగ్లాదేశ్ అవతరణ తర్వాత చేపట్టిన, అత్యధిక సవాళ్లతో కూడుకున్న ఇంజినీరింగ్ ప్రాజెక్టు ఇదేనని చెప్పొచ్చు.
పద్మా నదిపై నిర్మించిన ఈ వంతెన కోసం చైనా 3.7 బిలియన్ డాలర్లు (రూ.27,750 కోట్లు)ను పెట్టుబడిగా పెట్టింది.
- మోదీ బంగ్లాదేశ్ పర్యటన: 12 మంది మరణించే పరిస్థితులు ఎందుకు వచ్చాయి
- బంగ్లాదేశ్ న్యూస్ చానల్లో తొలిసారిగా వార్తలు చదివిన ట్రాన్స్జెండర్
చైనా ప్రాబల్యం
ఈ ప్రాజెక్టు విషయంలో చైనా కేవలం డబ్బులు మాత్రమే పెట్టుబడిగా పెట్టలేదు. ఇంజినీరింగ్ విషయంలో సాంకేతిక సాయాన్ని కూడా అందించింది. రెండు దేశాల మధ్య బలోపేతం అవుతున్న బంధాలకు ఈ వంతెన ఒక ఉదాహరణ అని చైనా అధికారిక వార్తా సంస్థ షిన్హువా ఒక కథనం ప్రచురించింది.
బంగ్లాదేశ్లో 30 బిలియన్ డాలర్ల (రూ.2,24,999 కోట్లు) ప్రాజెక్టులను చైనా చేపడుతోంది. పద్మా నదిపై తాజా వంతెన కూడా దీనిలో భాగమే. బంగ్లాదేశ్లో నానాటికీ పెరుగుతున్న చైనా ఆధిపత్యంపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముందని విదేశాంగ నిపుణులు, దౌత్యవేత్తలు విశ్లేషిస్తున్నారు.
బంగ్లాదేశ్.. భారత్ల మధ్య మొదట్నుంచీ మంచి సంబంధాలున్నాయి. బంగ్లాదేశ్ను భారత్కు సహజ భాగస్వామిగా నిపుణులు అభివర్ణిస్తారు. అయితే, ఈ భావన క్రమంగా మారుతూ వస్తోంది. బంగ్లాదేశ్ అవతరణలో భారత్ ప్రధాన పాత్ర పోషించిన మాట వాస్తవమే. అయితే, పాకిస్తాన్కు అత్యంత మిత్రదేశమైన చైనా.. ఇప్పుడు బంగ్లాదేశ్కూ చేరువవుతోంది.
ఢాకా స్టాక్ ఎక్స్ఛేంజ్లో 25 శాతం వాటా కొనుగోలు సమయంలో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. 1109 మిలియన్ డాలర్లు (రూ.8,317 కోట్లు) విలువైన ఈ వాటాను భారత్కు చెందిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)కు బదులుగా షాంఘైకు చెందిన షెంజెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు విక్రయించారు.
చైనా-బంగ్లాదేశ్ల మధ్య ఈ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ఎన్ఎస్ఈ అధికారులు ఢాకాకు కూడా వెళ్లారు. కానీ ఎలాంటి ఫలితమూ లేకపోయింది. చైనా తమ రాజకీయ అధికారాన్ని ఉపయోగించి ఈ వాటాను దక్కించుకుందని బ్లూంబర్గ్ ఓ వార్త ప్రచురించింది.
- బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్లో దొంగ పాస్పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
- 1971 గంగా హైజాక్: నకిలీ పిస్టల్తో పైలెట్లను భయపెట్టి, లాహోర్ తీసుకెళ్లి తగలబెట్టారు.. ఆ తర్వాత
భారత్ మెతక వైఖరి
ఈ పరిణామాల నడుమ భారత్ వైఖరి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. పొరుగునున్న దేశంలోని హిందువులపై వరుస దాడులు జరుగుతున్నప్పటికీ భారత్ ఆచితూచి స్పందిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలకు సంఘీభావంగా భారత్ తమ దౌత్య ప్రతినిధుల సాయంతో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నివేదనలు పంపించేది. కానీ ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
దీనికి విరుద్ధంగా, బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తమకు విశ్వాసం ఉందని భారత్ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హసీనాను మరింత ఇరుకున పెట్టడం ఇష్టంలేకే భారత్ ఇలా స్పందిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గతంలో జరిగిన ఇలాంటి ఘటనలతో పోలిస్తే, ప్రస్తుత పరిణామాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. నాసినగర్, సిల్హట్, మురాద్నగర్లలో ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, భారత్ గట్టిగానే స్పందించింది.
అంతేకాదు, బంగ్లాదేశ్లోని భారత రాయబారులు ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బంగ్లాదేశ్లోని హిందువుల హక్కుల గురించి వారు మాట్లాడారు.
అయితే, ఇప్పుడు కుమిల్లా, చాంద్పుర్, ఫెనీ, చిట్గావ్లలో పరిస్థితులపై భారత్ వైఖరి చాలా మెతకగా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజా దాడులపై గత వారం బీబీసీతో భారత మాజీ దౌత్యవేత్త పినాకరంజన్ చక్రవర్తి మాట్లాడారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.
''మతం పేరుతో హసీనా ప్రభుత్వాన్ని బలహీన పరచాలని కొందరు కుట్ర పన్నుతున్నారు. అయితే, వారు విజయం సాధించలేరు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 వరల్డ్ కప్ సూపర్ 12: బంగ్లాదేశ్పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం
- IndvsPak-T20 World Cup: 'బ్లాంక్ చెక్లో నచ్చిన అంకె రాసుకోండి, కానీ భారత్ను ఓడించండి’
- దళితుడిని నరికి, బ్యారికేడ్కు వేలాడదీసిన ఘటనకు ముందు, తర్వాత ఏం జరిగింది? - గ్రౌండ్ రిపోర్ట్
- మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే వెయ్యి మరణాలు.. టీకాలు వేయించుకోకపోవడం వల్లనేనా?
- భారత్లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- 'ఏపీలో విద్యుత్ కొరత లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)