షాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలు
ప్రపంచ దేశాలన్నింటినీ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది కాబట్టే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది. అగ్రరాజ్యం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పూర్తయి నాలుగు రోజులైనా తుదిఫలితాలు కాదుకదా, కనీసం విజేత ఎవరనేది కూడా తేలలేదు. శుక్రవారం నాటికి తుది ఫలితాలు రావొచ్చని భావిస్తుండగా, వచ్చే వారానికి కానీ కౌంటిక్ పూర్తికాబోదని ఆయా రాష్ట్రాల అధికారులు అధికారికంగా ప్రకటిస్తున్నారు. మరి అప్పటిదాకా నరాలు తెగాల్సిందేనా?
ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?
అమెరికాలో అంతే..
అగ్రరాజ్యంలో ఈసారి ఓట్ల లెక్కింపు ఆలస్యానికి ప్రధాన కారణం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా ఉండటమే అని చెబుతున్నారు. అలాంటప్పుడు 50 రాష్ట్రాల్లోనూ కౌంటిక్ ఒకేలా కాకుండా, కేవలం 9 రాష్ట్రాల్లోనే సాగదీత కొనసాగడానికి కారణమేంటని ఆరాతీస్తే.. బ్యాలెట్ ఓట్లను ఎలా స్వీకరించాలి? ఎప్పుటి వరకు తీసుకోవాలి? వాటిని ఎప్పుడు లెక్కించాలి? అనే విషయంలో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలు చట్టాలున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ తో పోల్చుంటే, రెండో అతి పెద్ద, సుదీర్ఘకాలంగా ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో కీలకమైన ఎన్నికల ప్రక్రియకు అసలు ఒక ప్రత్యేక వ్యవస్థ అంటూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. ప్రస్తుత ఉత్కంఠకు కారణాలను బ్రీఫ్ గా పరిశీలిస్తే..
9లో 5 ఉత్కంఠభరితం..
నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు నిర్వహిస్తారు. ఈసారి ఎలక్షన్ డే నవంబర్ 3న వచ్చింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా.. అమెరికాలోని మొత్తం(23.92కోట్ల మంది) ఓటర్లలో దాదాపు సగం మంది(10 కోట్ల మంది) పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. ఎలక్షన్ డే(మంగళవారం) రాత్రి 8 గంటలకు పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. కానీ దీన్ని(కౌంటింగ్) ఎప్పటిలోగా ముగించాలనే గడువుపై స్పష్టమైన చట్టాలేవీ చాలా రాష్ట్రాల్లో లేవు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో కౌంటింగ్ ఆలస్యంగా సాగుతోంది. అయితే వాటిలో నాలుగు చోట్ల చోట్ల మెజార్టీలో భారీ తేడా ఉండటంతో తదుపరి పోస్టల్ బ్యాలెట్ల కౌంటిగ్ ప్రభావం తుది ఫలితంపై ఉండదు. కానీ ఐదు రాష్ట్రాలు.. ఆరిజోనా, జార్జియా, నెవెడా, నార్త్ కరోలినా,పెన్సిల్వేనియాలో మాత్రం నరాలు తెగిపోయే ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపు ట్రంప్, కాసేజు బైడెన్ లీడ్లు సాధిస్తున్నారు. ఇంకా కలవర పెట్టే అంశం ఏంటంటే..
12 దాకా పోస్టల్ ఓట్ల స్వీకరణ..
అమెరికాలో ఎన్నికల ప్రక్రియను ఆయా రాష్ట్రాలే నిర్వహిస్తాయి. అందులోనూ చాలా చోట్ల ఎన్నికైన ప్రజా ప్రతినిధులు(సెక్రటరీ ఆఫ్ స్టేట్) ముఖ్య అధికారులుగా, కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారులే చీఫ్ లుగా వ్యవహరిస్తారు. ఆయా వ్యక్తులు(సెక్రటరీ ఆఫ్ స్టేట్) తమ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. గతంలోనూ కొన్ని సార్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కీలకంగా మారిన పోస్టల్ ఓట్ల విషయానికొస్తే, అక్టోబర్ 6 నుంచి పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణ ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 20 నుంచే వాటిని లెక్కించడం మొదలు పెట్టారు. కానీ అన్ని చోట్లా నిబంధనలు ఒకేలా లేవు. నేగా ఓటేసినా, పోస్టల్ ద్వారా వేసినా, కౌంటింగ్ మాత్రం మంగళవారం(ఎలక్షన్ డే) సాయంత్రం నుంచే కౌంట్ చేయాలని పలు రాష్ట్రాల్లో చట్టాలున్నాయి. మనం పైన చెప్పుకున్న 5 రాష్ట్రాలు ఆ జాబితా లోనివే. ఇంకా టెన్షన్ పెట్టించే మరో అంశం.. ఇప్పటికీ కొత్త పోస్టల్ బ్యాలెట్లను స్వీకరిస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్.. నవంబర్ 2లోపు పోస్ట్ అయిన(మెయిల్ బాక్సుల్లోకి చేరిన) ఓట్లను మాత్రమే పరిగణిస్తారు. ఉదాహరణకు నెవెడా రాష్ట్రంలో నవంబర్ 10 వరకు కూడా కొత్త పోస్టల్ బ్యాలెట్లను(నవంబర్ 2 తేదీ నాటికే పోస్ట్ అయినవి) స్వీకరించి, లెక్కబెడతారు. నార్త్ కరొలినాలోనైతే నవంబర్ 12, సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను కూడా కౌంట్ చేయాలనే నిబంధన ఉంది. దీంతో
అందుకే ట్రంప్ ఆగమాగం..
అన్ని దేశాల మాదిరిగానే అమెరికాలోనూ ఆయా వర్గాలు, సమూహాలు ఓట్లేసే తీరు భిన్నంగా ఉంటుంది. కరోనా జాగ్రత్తలు సూచిస్తూ, ఈసారి ఎర్లీ ఓటుపై విస్తృత ప్రచారం కల్పించడంతో డెమోక్రటిక్ పార్టీ మద్దతు దారులు భారీగా పోస్టల్ బ్యాలెట్ ను వాడుకున్నారని, వైరస్ మహమ్మారిని చులకన చేసే ప్రెసిడెంట్ ట్రంప్ తరహాలోనే రిపబ్లికన్ సపోర్టర్లలో ఎక్కువ మంది ఎలక్షన్ డే నాడు నేరుగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓట్లేశారని విశ్వసనీయ సర్వేల్లో తేలింది. మంగళవారం పోలింగ్ ముగిస్తే, శుక్రవారం దాకా కౌంటింగ్ చేయడాన్ని తప్పు పడుతూ ట్రంప్ క్యాంపెయిన్ కోర్టులను ఆశ్రయించగా, అన్ని చోట్లా ఎదురుదెబ్బలు తగిలాయి. కౌంటింగ్ నిలిపివేతకు కోర్టులు జడ్జిలు నో చెప్పడంతో.. ‘‘చూశారా? ఈ కోర్టులు మనల్ని పాలించాలనుకుంటున్నాయి..''అని ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ట్రంప్ ఆరోపిస్తున్నట్లు ఎన్నికల్లో అక్రమాలు.. అంటే, కొత్తగా వచ్చి చేరుతోన్న పోస్టల్ బ్యాలెట్ల అన్నీ రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నిజానికి హైటెన్షన్ నెలకొన్న ఐదు రాష్ట్రాల్లో మూడు చోట్ల ట్రంపే లీడ్ లో ఉన్నారు..
తాజా ఫలితాలు ఇలా..
బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలుగా భావిస్తోన్న చోట్ల ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా వెలువడిన గణాంకాలు ఇలా ఉన్నాయి.. 11 ఎలక్టోరల్ ఓట్లున్న ఆరిజోనాలో బైడెన్ 50.1 శాతం, ట్రంప్ 48.5 శాతం ఓట్లు, జార్జియా(16 ఓట్లు)లో ట్రంప్ 49.4 శాతం, బైడెన్ 49.4 శాతం), పెన్సిల్వేనియా(20 ఓట్లు)లో ట్రంప్ 49.5, బైడెన్ 49.2, నెవెడా(6 ఓట్లు)లో బైడెన్ 49.5, ట్రంప్ 48.5, నార్త్ కరోలినా (15 ఓట్లు)లో ట్రంప్ 50శాతం, బైడెన్ 48.6 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు. ఆరిజోనాలో ఇంకా 2లక్షల పైచిలుకు, జార్జియాలో ఆరు వేలు, నెవెడాలో 66, 596, నార్త్ కరోలినాలో 1.16లక్షలు, పెన్సిల్వేనియాలో 2.5లక్షల పోస్టల్ ఓట్లను లెక్కబెట్టాల్సి ఉంది. కొన్నిచోట్ల ఈనెల 12 దాకా పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించే వెసులుబాటు ఉండటంతో తుది ఫలితాలు కనీసం మరో వారం రోజులైనా ఆలస్యమవుతాయి. ఈలోపు కనీసం రెండు రాష్ట్రాలనైనా గెలవగలిగితే అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ అవతరిస్తారు. కాగా..
భారత ఎన్నికల సంఘానికి జేజేలు..
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల్లో తప్పులు నిరూపణ కానప్పటికీ, నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే విషయంలో రాష్ట్రాలు ఒక్కోతీరుగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది. చట్టాల పట్ల గొప్ప అవగాహన ప్రదర్శించే అమెరికా.. ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడు ముగించాలనేదానిపై నిర్దిష్టమైన ప్రమాణాలను పాటించకపోవడం, ఎన్నికల నిర్వహణలో రాష్ట్రాలు శక్తిమంతంగా, ఫెడరల్ ప్రభుత్వ జోక్యం మితంగా ఉండటం వల్లే ప్రెసిడెంట్ ట్రంప్ అనూహ్య వ్యాఖ్యలకు దిగుతున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల్లో గందరగోళం నెలకొన్నవేళ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఎన్నికల విధానంపైనా చర్చ జరుగుతోంది. అమెరికా కంటే మూడు రెట్లు ఎక్కువ ఓటర్లు(దాదాపు 100 కోట్ల మంది) పాల్గొనే ఎన్నికలను సమర్థవంతంగా, కచ్చితమైన సమయానికి నిర్వహించే భారత ఎన్నికల సంఘానికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. మన దేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకో, కేంద్రానికో వదిలేయకుండా.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ముందు చూపుతో ఆర్టికల్ 324 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం పేరుతో స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశ అత్యున్నద పదవి రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే బాధ్యతను స్వతంత్ర సంస్థ అయిన ఈసీకి అప్పగించారు.
ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్కు జైకొడుతూ..