ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్న అమెరికా, 10 మందిని పొట్టనబెట్టుకున్న కార్చిచ్చు
అమెరికాలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియాలో సోమవారం రాత్రి కార్చిచ్చు చెలరేగింది. ఈ మంటల ధాటికి ఇప్పటికే 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 1500 ఇళ్లు తగలబడ్డాయి.
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రకృతి విపత్తులతో ఆ దేశం అతలాకుతలమవుతోంది. ఓవైపు హరికేన్లు విలయాన్ని సృష్టిస్తుండగా.. మరోవైపు కార్చిచ్చు కాల్చుకుతింటోంది.
అమెరికాలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియాలో సోమవారం రాత్రి కార్చిచ్చు చెలరేగింది. ఉత్తర కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటలు వేగంగా సమీప ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. భారీగా అగ్నీ కీలలు ఎగసిపడుతున్నాయి.
ఈ మంటల ధాటికి ఇప్పటికే 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 1500 ఇళ్లు తగలబడ్డాయి. 20,000 వేల మందికిపైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
దాదాపు 30 వేల హెక్టార్లలోని అడవి తగలబడుతోందని అమెరికా అగ్నిమాపక శాకా అధికారులు వెల్లడించారు. నాప, సొనొమా, యుబా కౌంటీస్లోని దాదాపు 14 ప్రాంతాలలో మంటల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు.
గ్యాస్పైప్లైన్ లేదా గ్యాస్ ట్యాంకర్ పేలడమే ఈ మంటల వ్యాప్తికి కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోకు 60 కిలోమీటర్ల దూరంలో మంటల ప్రభావం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.