పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికలు నేడు: భారీ భద్రత, ఇమ్రాన్కు క్రికెటర్ల మద్దతు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో బుధవారం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ భవిష్యత్తు ప్రధాని ఎవరనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ)ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
అయితే పార్టీ వర్గాలతో పాటు పాకిస్థాన్ క్రికెట్ కుటుంబమంతా ఇమ్రాన్ ఖాన్ను మించిన ప్రధాని అభ్యర్థి పాకిస్థాన్కి లేడని ముక్త కంఠంతో చెబుతోంది. ఇమ్రాన్ సహచర పాక్ క్రికెట్ దిగ్గజాలు జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, వకార్ యూనిస్లు బహిరంగంగా ఇమ్రాన్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు.
ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ఖాన్ గెలుపు కోసం సైన్యం ఆరాటపడుతున్నదన్న ఆరోపణలతోపాటు ఉగ్రవాద సంస్థలకు చెందిన అభ్యర్థులు భారీగా పోటీలో నిలిచిన నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 272 జాతీయ అసెంబ్లీ సీట్ల కోసం 3,459 మంది అభ్యర్థులు బరిలో ఉండగా నాలుగు రాష్ర్టాల అసెంబ్లీల్లోని 577 సీట్ల కోసం 8,396 మంది పోటీపడుతున్నారు. దేశంలో మొత్తం 10.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల నేపథ్యంలో మీడియాపై తీవ్రమైన అణచివేత కొనసాగుతున్నదని ప్రజాస్వామికవాదులు ఆరోపిస్తున్నారు. పీటీఐ నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ఖాన్ ప్రచారానికి సైన్యం రహస్యంగా మద్దతు ఇస్తున్నదని.. ఆయన ప్రత్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ చరిత్రలో అత్యధిక కాలంపాటు దేశాన్ని ఏలిన సైన్యం.. పౌర ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా విదేశీ, భద్రతా విధానాల్లో అపరిమిత అధికారాలను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.
ఇలాంటి తరుణంలో ఆర్మీకి మెజిస్టీరియల్ అధికారాలు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతోపాటు పోలింగ్ స్టేషన్లలోపల, బయట విధులు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సైన్యాన్ని నియమించడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. ఎన్నికల సంఘానికి సహకారం మాత్రమే అందిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఖ్వామర్ బజ్వా హామీ ఇచ్చినా సైన్యం పాత్రపై సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ఉగ్రవాద నాయకులు ఎన్నికల గోదాలోకి దిగి.. సంప్రదాయ రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని నిషేధిత జేయూడీ అభ్యర్థులు తాము ఎన్నికల్లో గెలువడం ద్వారా పాకిస్థాన్ను ఇస్లాంకు కంచుకోటగా మారుస్తామని సవాళ్లు విసురుతున్నారు.
సయీద్ అల్లుడు కూడా ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా ప్రధాన పోటీ జైలులో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్), ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ (పీటీఐ) మధ్యలోనే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మూడో స్థానానికి మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంటున్నారు.
కాగా, మెజిస్టీరియల్ అధికారులు సంక్రమించిన తర్వాత తన జోక్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. సైన్యం కనీవినీ ఎరుగనిరీతిలో ఎన్నికలకు భద్రత కల్పిస్తున్నది. పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3,71,388 మంది బలగాలను భద్రత కోసం మోహరించింది. బుధవారం ఎన్నికలు జరుగుతున్న 85 వేల పోలింగ్స్టేషన్లలో వీరు విధులు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా బలగాల మోహరింపు పూర్తయ్యిందని, స్థానిక పోలీసులతో కలిసి సురక్షితంగా ఎన్నికలను నిర్వహిస్తామని సైన్యం పేర్కొంది. కాగా ఈ ఎన్నికల్లో పంజాబ్ ప్రావిన్స్ సానుకూలత ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.