దద్దమ్మలం కాదు: పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిన మోడీ
ఇస్లామాబాద్: యురి దాడుల తర్వాత కుతకుత ఉడికిపోతూ సంయమనం పాటిస్తూనే పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడి పెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తూ వస్తోంది. పాకిస్తాన్పై అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ఒత్తిడి తేవడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్న మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్ ద్వారా సైన్యం ద్వారా అంతే తెగువ చూపించగలమేన సంకేతాలను పంపించింది.
తాము ఎంతకైనా తెగిస్తామని గురువారం ఉదయం నరేంద్ర మోడీ ప్రభుత్వం పాకిస్తాన్కు సంకేతాలు పంపించింది. ఉగ్రవాద స్థావరాలను గురిపెట్టి దాడులు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆగడాలకు పాల్పడుతుంటే చేతులు ముడుచుకుని కూర్చోబోమని చర్యల ద్వారా ప్రభుత్వం సమాధానం చెప్పింది.
యురిలో 18 మంది భారత సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనకు బదులు చెప్తామని నరేంద్ర మోడీ చేసి చూపించారు. యురి ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే మోడీ ఉన్నట్లు అనిపిస్తోంది. యురి దాడిని క్షమించబోమని నరేంద్ర మోడీ అన్న విషయం తెలిసిందే.
నరేంద్ర మోడీ ఐదు రోజుల క్రితం ఊరికనే ఆ మాట అనలేదని ఈ రోజు తేలిపోయింది. దౌత్యపద్ధతుల్లో, శాంతియుతంగా పాకిస్తాన్ను దారిలోకి తేవాలని భారత్ ప్రయత్నాలు చేసింది. అయితే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరో విధంగా ప్రతిస్పందించారు. ఉగ్రవాదులను అరికట్టడానికి సరైన చర్యలు తీసుకోకపోగా తమ దేశమే ఉగ్రవాద పీడిత దేశమని మసి పూసి మారేడు కాయ చేయడానికి ఆయన ప్రయత్నించారు.
భీంబర్, హాట్ స్ప్రింగ్, కేల్, లిపా సెక్టార్లలో మిలిటరీ ఆపరేషన్ జరిగినట్లు లెఫ్టెనెంట్ జనరల్ రణవీర్ సింగ్ చెప్పారు. 20 చొరబాటు యత్నాలను తాము అడ్డుకున్నామని కూడూ చెప్పారు.