కవచాలుగా మదరసా విద్యార్ధులు ? పాక్ మరో దుష్ట పన్నాగం..!
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు వరుస షాకులు తగలుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశం యుద్దాన్ని తట్టుకోలేని పరిస్ధితి ఉండటం, భారత్ తో పోలిస్తే పరిమిత సైన్యం, ఆయుధాలు మాత్రమే ఉండటంతో యుద్దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అపోసోపాలు పడుతోంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రులు రోజుకో రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ రక్షణమంత్రి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
భారత్ తో యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సైన్యం సరిపోదన్న అంచనాల మధ్య ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్ లో స్పందించిన రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ మదరసా విద్యార్ధుల్ని సైతం తమ రెండో రక్షణ కవచంగా వాడుతామని ప్రకటించారు. వారిని రెండో రక్షణ శ్రేణిగా ఆయన అభివర్ణించారు. సరిహద్దు శత్రుత్వాలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మదర్సాలు లేదా మదర్సా విద్యార్థుల విషయానికొస్తే, వారు మా రెండవ రక్షణ శ్రేణి అనడంలో ఎటువంటి సందేహం లేదని రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. సమయం వచ్చినప్పుడు, అక్కడ చదువుతున్న యువకులను అవసరమైన విధంగా 100 శాతం ఉపయోగిస్తారన్నారు. తద్వారా సైన్యం భారత దాడుల్ని పూర్తిగా ఎదుర్కొనే పరిస్ధితుల్లో లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు.
ఇప్పటికే పాకిస్తాన్ తమ పౌర విమానాల్ని కవచాలుగా వాడుకుంటూ భారత దాడుల్ని తప్పించుకునేందుకు చూస్తుందని మన విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పుడు మదరసా విద్యార్ధుల్ని సైతం ఇలా కవచాలుగా వాడుకోవాలన్న పాక్ పన్నాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications