వచ్చే నెలలోనే భూమి అంతం, దూసుకొస్తున్న 'నిబిరు': కాన్స్పిరిసీ థియరిస్ట్ హెచ్చరిక
భూమి అంతం దగ్గరపడిందంటూ కాన్స్పిరిసీ థియరిస్టులు హెచ్చరిస్తున్నారు. మరో నెల రోజుల్లో భూమి అంతం తప్పదని కాన్స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ తెలిపారు.
న్యూయార్క్: భూమి అంతం దగ్గరపడిందంటూ కాన్స్పిరిసీ థియరిస్టులు హెచ్చరిస్తున్నారు. మరో నెల రోజుల్లో భూమి అంతం తప్పదని, ఈలోగా తీరని కోరికలేవైనా ఉంటే తీర్చుకోవాలని సూచిస్తున్నారు. కాన్స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
వచ్చే నెల 20 నుంచి 23 తేదీల మధ్య భూప్రళయం తప్పదని మీడ్ జోస్యం చెబుతున్నారు. ఆ మూడు రోజుల వ్యవధిలో నిబిరు అనే గ్రహం భూమిని ఢీకొట్టబోతుందని, దాంతో భూమి ముక్కలు ముక్కలై సమస్త జీవాలు నశిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.
మరో 24రోజులు మాత్రమే భూమి మీద మానవాళి మనుగడ సాగిస్తుందని, బైబిల్ సహా గిజా పిరమిడ్ లోను దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని మీడ్ తెలిపారు. తీర్చుకోవాల్సిన కోరికలేమైనా ఉంటే ఈలోగా తీర్చుకోమని సలహా ఇస్తున్నారు.
సెప్టెంబర్ రెండో వారం నుంచి నిబిరు గ్రహాన్ని ప్రజలంతా స్పష్టంగా చూడవచ్చునని అన్నారు. 2016జనవరిలో నిబిరు గ్రహం గురించి తొలిసారిగా చర్చ జరిగింది. ప్లానెట్ ఎక్స్ గా పిలిచే ఈ గ్రహం ప్రస్తుతం సౌర కుటుంబానికి అంచున ఉన్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి ఇదో ఊహజనిత గ్రహం అని కూడా అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ గ్రహం భూకక్ష్యలోకి ప్రవేశించిందని విశ్వసిస్తున్న కాన్స్పిరసీ థియరిస్టులు భూమిని అది ఢీకొట్టబోతుందని చెబుతున్నారు.