విండోస్10 చిక్కు: 10వేల డాలర్లు చెల్లించిన మైక్రోసాఫ్ట్
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ గత జులైలో అత్యాధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ఆ సంస్థకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఆరు నెలల్లోనే 30కోట్ల మందికిపైగా ఈ ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకున్నారు. అయితే ఆ సంఖ్యను మరింత పెంచేందుకు విండోస్ పాత వెర్షన్ ఓఎస్లను వాడుతున్న వారికి విండోస్ 10కి అప్గ్రేడ్ చేసుకోండంటూ మైక్రోసాఫ్ట్ నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభించింది.
ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ తమను బలవంతపెడుతోందని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండానే కంప్యూటర్లో విండోస్10 ఇన్స్టాల్ అయిపోయిందంటూ మరికొందరు మండిపడ్డారు. అలాంటి ఆరోపణతోనే ఓ మహిళ కోర్టుకెక్కింది. తాజాగా వెలువడ్డ కోర్టు తీర్పుతో పరిహారంగా ఆమెకు మైక్రోసాఫ్ట్ 10వేల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన తెరి గోల్డ్స్టెయిన్ అనే మహిళ ఓ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతోంది. అయితే విండోస్ 7తో పనిచేస్తున్న ఆమె కంప్యూటర్లో తెలియకుండానే విండోస్ 10ఇన్స్టాల్ అయిపోయిందట. దీంతో కంప్యూటర్ పూర్తిగా పనిచేయకుండా పోయిందని.. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందంటూ స్థానిక కోర్టులో కేసు వేసింది ఆ మహిళ.
'నా అనుమతి లేకుండా నా కంప్యూటర్లో విండోస్ 10ను ఎలా ఇన్స్టాల్ చేస్తారు?' అంటూ మైక్రోసాఫ్ట్ సంస్థపై కేసు వేసింది. అంతేగాక, పరిహారంగా 17వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు.. సదరు మహిళకు మైక్రోసాఫ్ట్.. 10వేల డాలర్లు(సుమారు రూ.6.8 లక్షలు) చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
కాగా, తాము ఎలాంటి తప్పు చేయలేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఈ జరిమానా పెద్దది గాకుండా చూసేందుకు వెంటనే ఆ మొత్తాన్ని సదరు మహిళకు చెల్లించివేసింది మైక్రోసాఫ్ట్ సంస్థ.