అమెరికా ఎయిర్ పోర్టుల్లో భావోద్వేగ దృశ్యాలు.. తమవాళ్లను కలుసుకున్నారు..
ఇలాంటి తరుణంలో సియాటెల్ ఫెడరల్ కోర్టు పుణ్యమాని.. బయట దేశాలకు వెళ్లిన ముస్లింలంతా తిరిగి అమెరికా చేరుకుంటున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయా నిషేధిత దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ ముస్లింల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
మరీ ముఖ్యంగా.. వాళ్లలో అమెరికా నుంచి బయటకెళ్లిన ముస్లింలు.. తిరిగి అమెరికాలో అడుగుపెట్టగలరా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో సియాటెల్ ఫెడరల్ కోర్టు పుణ్యమాని.. బయట దేశాలకు వెళ్లిన ముస్లింలంతా తిరిగి అమెరికా చేరుకుంటున్నారు.
దీంతో అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఎక్కడ చూసినా.. భావోద్వేగ దృశ్యాలే కనిపిస్తున్నాయి. భర్తలను కలుసుకున్న భార్యలు.. తల్లిదండ్రులను కలుసుకున్న పిల్లలు.. ఇలా తమవారు తిరిగి అమెరికా చేరడంతో నిరాశలో నిస్సహాయులుగా మిగిలిపోయినవారికి కొత్త ఊపిరి పడ్డట్టయింది.
కాగా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించగా.. దానిపై సియాటెల్ ఫెడరల్ కోర్టు 'స్టే' విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా దేశాలకు వెళ్లిన అమెరికన్ ముస్లింలు తిరిగి అమెరికా చేరుకుంటున్నారు. తమవారిని కలుసుకున్న ఆనందంలో కంటతడి పెడుతున్నారు.