మరణించిన మహిళ తిరిగిలేచింది!(వీడియో)
కరాచీ: పాకిస్థాన్లో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. యాభై ఐదేళ్ల ఓ మహిళ మంజూరాన్ బీబీ మరణించిందనుకొని.. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటికలో ఖననం చేసే ముందు నిర్వహించే ఘుస్ల్ (స్నానం) కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు.
అయితే ఊహించని విధంగా ఆమె తిరిగి ప్రాణాలతో లేవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత శ్మశానం నుంచి ఆమెను భర్తతోపాటు ఇంటికి సాగనంపారు. ఈ ఘటన కరాచీలోని దంబా గోథ్ సమీపంలోని సూపర్ హైవే వద్ద చోటుచేసుకుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న మంజూరాన్ బీబీ అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమె మరణించిందనుకొని శ్మశాన వాటికకు తీసుకొచ్చి.. అంత్యక్రియలకు ముందు నిర్వహించే అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు. అంతలోనే ఆమెలో చలనం కనిపించిందని ఈథీ ఫౌండేషన్ ప్రతినిధి అన్వర్ కైజ్మీ పేర్కొన్నారు.
అపస్మారక స్థితిలోకి చేరుకొన్న తర్వాత ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లక పోవడమో లేదా వైద్యుడిని పిలిపించడమో జరిగితే ఇదంతా జరిగి ఉండేది కాదని కైజ్మీ తెలిపారు.
ఇది ఇలా ఉండగా, మృత్యువు ముఖంలోకి వెళ్లి వచ్చిన ఆమె మాటలు చిన్న పిల్లల గొంతుతో మాట్లాడినట్లుగా ఉండటం గమనార్హం. మళ్లీ పుట్టిన కారణంగానే ఆమె గొంతు చిన్న పిల్లల గొంతును పోలి ఉందని పలువురు అంటున్నారు.
అయితే, మంజురాన్ బీబీ భావోద్వేగాన్ని టెలివిజన్ ఛానెళ్లు పదే పదే ప్రసారం చేశాయి. పునర్జన్మను ప్రసాదించిన భగవంతుడికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది.