రష్యా విమానం కూలిపోవడంలో 'ఉగ్ర' కోణం ఉందా? ఐస్ ఇరుక్కొని..
మాస్కో: రష్యా రాజధాని మాస్కో శివారులో విమానం కూలి 71 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మాస్కోలోని డొమండెడోవ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ప్రమాద సమయానికి ఆరుగురు సిబ్బంది, 65 మంది ప్రయాణీకులు ఉన్నారు.
మాస్కో నుంచి ఓర్స్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే రాడార్ తెరపై ఇది గల్లంతైంది.
విమానంలోని యాంటీ ఐసింగ్ సిస్టమ్లో సాంకేతిక లోపం రావడంతో ఇంజిన్లో మంచు ఇరుక్కుని విమానంలో మంటలు వ్యాపించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరోపక్క ఈ ప్రమాదం వెనక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు. విమానంలో సమస్య ఎదురైనప్పుడు సిబ్బంది ఏటీసీకి ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విమానంలో సాంకేతిక సమస్య ఎదురైనప్పుడు చీఫ్ పైలట్ వలెరి గుబనోవ్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి ఉంటాడని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ విమానానికి చెందిన రెండో బ్లాక్బాక్స్ను రష్యా దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. విమాన శకలాలు దాదాపు అర కిలోమీటరు దూరంలో ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు. విమానం దానంతట అదే కూలిపోతే శకలాలు ఒక చోటే పడి ఉంటాయని దీన్ని బట్టి చూస్తే విమానంలో పేలుడు కూడా సంభవించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.