కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రపంచం- కరోనా భయాలు, ఆంక్షలు, కర్ఫూల మధ్య వేడుకలు
శతాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని ఉత్పాతంతో కుదేలైన ప్రపంచ దేశాలు భారమైన హృదయంతో 2020కు వీడ్కోలు పలికి 2021ని ఆహ్వానించాయి. ఈ ఏడాదైనా తమకు కష్టాలు తొలగిపోయి శుభాలు కలగాలని ఆశిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కొత్త ఏడాది ఆరంభ వేళ కూడా కరోనా మహమ్మారి భయాలు వీడకపోవడంతో వీటి మధ్యే వేడుకలు జరుపుకోవాల్సిన దుస్ధితి దాపురించింది. సొంత ప్రభుత్వాలే తమ క్షేమాన్ని కాంక్షిస్తూ ఆంక్షలు విధించడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో జనం ఇళ్లలోనే వేడుకలు జరుపుకున్న పరిస్ధితులు చాలా దేశాల్లో దర్శనమిచ్చాయి.
Recommended Video
2021లో అడుగుపెట్టిన ప్రపంచం
కోటి ఆశల్ని మోసుకొచ్చిన కొత్త ఏడాదికి ప్రపంచ దేశాలు ఘనంగా స్వాగతం పలికాయి. అయితే గతంలో జరుపుకున్నట్లుగా బహిరంగ వేడుకల రూపంలో కాదు ఇళ్లలోనే ఉంటూ కొత్త ఏడాదిని ఆహ్వానించారు. కుటుంబ సభ్యులను, బంధువులను ఇళ్లకే ఆహ్వానించి వేడుకలు జరుపుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ పరిస్దితులు, కొత్త వైరస్ భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆంక్షలు, కర్ఫ్యూలు విధించడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పరిమిత స్ధాయిలోనే వేడుకలు చేసుకోవాల్సిని పరిస్దితి మరికొన్ని దేశాల్లో కనిపించింది.
పసిఫిక్ దేశాలతో మొదలైన వేడుకలు..
పసిఫిక్ దేశాలైన కిరిబటి, సమోవా మొట్టమొదటిగా 2021లోకి ప్రవేశించాయి. అనంతరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్లాండ్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన క్రాకర్స్ను చూసేందుకు జనం బారులు తీరారు. బహిరంగ వేడుకలపై పలు చోట్ల ఆంక్షలు కొనసాగుతుండటంతో జనం రోడ్లపై వేడుకలు చేసుకునే వీలు లేకుండా పోయింది. ఆసియా దేశాల్లోనూ కరోనా ప్రభావంతో ప్రభుత్వాలు ఆంక్షలు కొనసాగించాయి. యూరప్లోనూ కొత్త వైరస్ భయాలు కొత్త ఏడాది వేడుకలను వెంటాడాయి. దీంతో పరిమిత స్ధాయిలోనే వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్ధితి. అమెరికాలోనూ జనం కొత్త సంవత్సర వేడుకలను కరోనా ఆంక్షల మధ్యే జరుపుకుంటున్నారు.
పలు దేశాల్లో కర్ఫ్యూలు
కరోనా భయాలతో చాలా దేశాల్లో ప్రభుత్వాలు కర్ఫ్యూలను కొనసాగించాయి. హాంకాంగ్లో కర్ఫ్యూ కారణంగా కేవలం విక్టోరియా హార్బర్ వద్ద జనం సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. జపాన్లోని టోక్యోలోనూ రోజుకు 1300 కేసులు నమోదవుతుండటంతో ఎమర్జెన్సీ విధించారు. దీంతో ప్రజలు సంప్రదాయ ప్రార్ధనలకే పరిమితమయ్యారు.
కరోనా తొలిసారిగా బయటపడిన చైనాలోని వుహాన్ నగరంలో పరిస్ధితులు క్రమంగా అదుపులోకి రావడంతో వందలాది మంది కొత్త ఏడాదిలో బాణాసంచా కాల్చారు. రష్యాలో సెకండ్వేవ్ పరిస్ధితులు ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్ కొత్త ఏడాది సందేశంలో ప్రజల్ని హెచ్చరించారు. ఇటలీలో కరోనా పరిస్ధితి దృష్ట్యా జనవరి 7 వరకూ లాక్డౌన్ కొనసాగుతుండటంతో వేడుకలు లేకుండా పోయాయి. ఫ్రాన్స్, లాత్వియా, బ్రెజిల్లోనూ రాత్రి పూట కర్ఫ్యూలతో వేడుకలు కళ తప్పాయి. లండన్లోనూ కొత్త వైరస్ భయాలతో చాలా చోట్ల ఆన్లైన్ వేడుకలే జరుపుకున్నారు.
కొన్ని దేశాల్లో బహిరంగ వేడుకలు..
కరోనా ఇంకా నమోదవుతున్న దుబాయ్లో మాత్రం బహిరంగ వేడుకలు కనిపించాయి. బుర్జ్ ఖలీఫా వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్, లేజర్ షోలో భారీ ఎత్తున జనం పాల్గొన్నారు. మాస్కులు ధరించి బహిరంగ స్ధలాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వేడుకల్ని లైవ్లో తిలకించారు. భారీ విస్ఫోటనంతో అతలాకుతలమైన బీరుట్లో రాత్రి మూడింటివరకూ నైట్ క్లబ్లులకు అనుమతి ఇవ్వడంతో వేడుకలు జరిగాయి. మరికొన్ని దేశాల్లోనూ ఆంక్షలు ఉన్నప్పటికీ స్ధానిక ప్రభుత్వాలు పరిస్దితుల ఆధారంగా వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడంతో జనం బయటికొచ్చారు.
దీంతో అక్కడ సాధారణ పరిస్ధితులు కనిపించాయి. భారత్లోనూ చాలా చోట్ల జనం రోడ్లపైకి వచ్చారు. భారీగా కాకపోయినా ఓ మోస్తరుగా రోడ్లపైకి వచ్చి పలు నగరాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈసారి ప్రత్యేకంగా కొత్త ఏడాది వేడుకలకు మాత్రం నిర్వాహకులకు అనుమతి నిరాకరించారు.