జిన్పింగ్ ముందు మోడీ 'సరిహద్దు', 'బ్యాంక్' విజయం
బీజింగ్/ఫోర్టాలెజా: సరిహద్దు వివాదానికి తెర దించుదామని, ఎన్నాళ్లుగానో నలుగుతున్న సమస్యను పరిష్కరించుకుందామని, దీనిని మనం సామరస్యంగా పరిష్కరించుకోగలిగితే, ప్రపంచానికే ఆదర్శంగా నిలవొచ్చని చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ అభిప్రాయంతో జిన్పింగ్ పూర్తిగా ఏకీభవించారు. భారత్, చైనాలు ప్రత్యర్థులు కాదని జిన్ పింగ్ అన్నారు.
స్నేహపూర్వకంగా, సానుకూల దృక్పథంతో ముందుకెళదామని, ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని జిన్పింగ్ ఉటంకిస్తూ చైనా అధికార వార్తాసంస్థ సిన్హువా పేర్కొంది. ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్లో కొంత భూభాగాన్ని చైనా తమదిగా పేర్కొంటూ, తమ మ్యాప్లలో కలిపేసుకున్న సంగతి తెలిసిందే.
అరుణాచల్ ప్రదేశ్ వెంట 4057 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ ఉందని భారత్ చెబుతుండగా... కాదు, అది 2000 కిలో మీటర్లకే పరిమితమని చైనా వాదిస్తోంది. బ్రిక్స్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు సోమవారం బ్రెజిల్ వచ్చిన మోడీ... చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం 40 నిమిషాలు మాత్రమే జరగాల్సిన ఈ సమావేశం... 80 నిమిషాలపాటు కొనసాగింది. ఇరు దేశాల అధినేతలు అరమరికల్లేని విధంగా అనేక అంశాలపై చర్చించుకున్నారు. తాము అనేక అంశాలపై చర్చించుకున్నామని, మొత్తం భేటీ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే... అది చాలా బాగా జరిగిందని అని మోడీ ట్వీట్ చేశారు. ఈ సమావేశంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు వివాదంపై గతంలో ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో 17 సమావేశాలు జరిగాయి.
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)తోపాటు ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ వేదికలపై పరస్పర ప్రయోజనాలు సాధించేలా కృషి చేయాలని ఈ భేటీలో ఇరు దేశాల నేతలు నిర్ణయించుకున్నారు. ఇదే నేపథ్యంలో... ఈ ఏడాది నవంబర్లో చైనాలో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) సదస్సుకు చైనా ప్రభుత్వం అనూహ్యంగా భారత్ను ఆహ్వానించింది.
ఆసియా, పసిఫిక్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ బృందంలో 21 దేశాలున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో)తోనూ భారత్ బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని జిన్పింగ్ ఆకాంక్షించారు. ఎస్సీవోలో చైనా, కజక్స్థాన్, కిర్జిజిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఉన్నాయి.
మరోవైపు, టిబెట్లోని కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే హిమాలయాల్లోని ప్రస్తుత మార్గం దుర్గమ మార్గంగా ఉన్న దృష్ట్యా మరో మార్గాన్ని తెరవాలని సమావేశం సందర్భంగా మోడీ కోరగా, ఇది పరిశీలించదగ్గ సూచన అని జీ జిన్పింగ్ అంగీకరించారని ప్రకటన తెలిపింది.
బ్రిక్స్ వేదికపై...
బ్రెజిల్లోని ఫోర్టాలెజాలో జరుగుతున్న బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో కొత్త అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనపై అంగీకారం కుదిరింది. 100 మిలియన్ డాలర్ల ప్రారంభ అధీకృత పెట్టుబడితో ఈ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఏ దేశానికి ఆధిపత్యం లేకుండా అందరికీ సమాన వాటా ఉండాలన్న భారత్ చేస్తున్న వాదనకు సభ్య దేశాల నుండి మద్దతు లభించింది. కాగా, బ్యాంకు ప్రధాన కార్యాలయం కోసం భారత్ పోటీ పడింది. అయితే చెన్నైలోని షాంఘైకి ఇది దక్కింది. అయితే వంతుల వారీగా చేపట్టే అధ్యక్ష భాద్యత తొలుత భారత్కు దక్కింది. బొర్డ్ ఆఫ్ గవర్నర్ల తొలి అధ్యక్ష పదవి రష్యాకు దక్కింది.