Year Ender : కరోనా ప్రపంచానికి చేసిన మేలు ఇదొక్కటే.. రికార్డు స్థాయిలో.. ఇదీ గ్లోబల్ రిపోర్ట్
కరోనా లాక్ డౌన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎంతలా కుదేలు చేసిందో తెలిసిందే. చాలా దేశాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. భారత్ లాంటి దేశాల్లో అయితే చిన్నా,చితకా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. రోజు వారీ కూలీలు,కార్మికులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చాలామంది ప్రొఫెషనల్స్ సైతం ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా కారణంగా మానవాళికి ఇంత నష్టం జరగ్గా... పర్యావరణానికి మాత్రం మేలు జరగడం గమనార్హం. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు శుక్రవారం(డిసెంబర్ 11) వెల్లడించిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

రికార్డు స్థాయిలో తగ్గిన కార్బన్ ఉద్గారాలు...
గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు నివేదిక ప్రకారం... కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు గాలిలో 7శాతం మేర తగ్గిపోయాయి. అంటే,ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ మెట్రిక్ టన్నుల మేర గాలిలో కార్బన్ ఉద్గారాలు పడిపోయాయి. దీంతో పాత రికార్డులు బద్దలైపోయాయి. గతంలో రెండో ప్రపంచ యుద్ద ముగింపు కాలంలో 0.9 బిలియన్ మెట్రిక్ టన్నుల మేర గాలిలో కార్బన్ ఉద్గారాలు తగ్గగా... 2009లో ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న కాలంలో 0.5శాతం మేర కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. కరోనా లాక్ డౌన్ పీరియడ్లో అది ఏకంగా 7శాతంగా నమోదవడం విశేషం.

లాక్ డౌన్ ఎఫెక్ట్...
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ అమలవడం కార్బన్ ఉద్గారాలు పడిపోవడానికి ప్రధానంగా కారణంగా పరిశోధకులు చెప్తున్నారు. లాక్ డౌన్ పీరియడ్లో
ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం.. కార్లు,ఇతరత్రా వాహనాలు రోడ్ల పైకి రాకపోవడం,ఆఖరికి విమానాలు కూడా రద్దవడంతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా పడిపోయాయని అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రోడ్డు రవాణా ద్వారా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు 10 శాతం మేర పడిపోయినట్లు తెలిపారు. అలాగే విమాన రాకపోకల కారణంగా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు 40శాతం పడిపోయినట్లు చెప్పారు.

యూఎస్,యూకెల్లో...
ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల కార్యకలాపాలాన్నీ నిలిచిపోవడంతో.. తద్వారా 22శాతం మేర కార్బన్ ఉద్గారాలు పడిపోయినట్లు నివేదికలో వెల్లడైంది. కొన్ని దేశాల్లో పకడ్బందీ లాక్ డౌన్ చర్యల కారణంగా ఇది 30శాతంగా కూడా ఉండటం గమనార్హం. ప్రధానంగా యూఎస్,యూకెల్లో 12శాతం,11శాతం మేర కార్బన్ ఉద్గారాలు పడిపోయాయి. చైనా త్వరగానే తమ ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో అక్కడ కేవలం 1.7శాతం మేర మాత్రమే కార్బన్ ఉద్గారాలు తగ్గిపోయాయి.

పారిస్ ఒప్పందం ప్రకారం..
ఐదేళ్ల క్రితం నాటి పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం... ఈ దశాబ్దంలో సంవత్సరానికి 1 నుండి 2 బిలియన్ మెట్రిక్ టన్నుల చొప్పున కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగితే... ప్రపంచ ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకే పరిమితం చేయవచ్చు. కానీ 2015 నుంచి ప్రతీ ఏటా కార్బన్ ఉద్గారాలు పెరుగతూనే ఉన్నాయి. 2030 వరకు ప్రతీ ఏటా 7.6శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగితేనే ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయవచ్చునని ఐక్యరాజ్య సమితి గతంలో పేర్కొంది. కరోనా లాక్ డౌన్ పీరియడ్లో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గినప్పటికీ... అది తాత్కాలికమేనని దీర్ఘ కాలంలో తగిన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకోవాలని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications