క్రిమినల్ కపుల్: నగరం శుభ్రంగా ఉండాలని డజను హత్యలు చేశారు!
మాస్కో: ఏదైనా నగరం శుభ్రంగా ఉండాలంటే ‘స్వచ్ఛ భారత్' లాంటి కార్యక్రమాలు చేపట్టిలి కానీ.. ఇక్కడ ఈ దంపతులు అపరిశుభ్రంగా ఉంటున్నారని ఏకంగా మనుషులనే హత్యలు చేయడం ప్రారంభించారు. కూడు గూడులేక ఫుట్పాతర్లు, పబ్లిక్ పార్కుల్లో తలదాచుకున్నవారినీ, పీకలదాకా తాగేసి దారితెన్ను తెలియక ఫుట్ పాతులపై పడిపోయిన మందుబాబులనూ లక్ష్యంగా చేసుకొని వారు హత్యలకు పాల్పడ్డారు.
ఇంకా ఆ క్రిమినల్ దంపతులేమంటున్నారంటే.. అనాథలు, అభాగ్యులులేని, తాగుబోతులు కనిపించని 'స్వచ్ఛ' మాస్కో నగరాన్ని స్థాపించడమే వారి లక్ష్యమని చెబుతున్నారు. నిరుడు జూలై నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెల వరకు మొత్తం 12 హత్యలు చేసి చివరకు దొరికిపోయారు. 20 ఏళ్ల పాల్ వొయితోవ్, 25 ఏళ్ల ఎలేనా లొబచేవ అనే దంపతులు ఈ దారుణాలకు తెగబడ్డారు.
ఈ దంపతులు వివిధ రకాల కత్తులు, మారణాయుధాలతో రాత్రిపూట జన సంచారం ఎక్కువలేని సమయాల్లో ఫుట్పాత్లు, పబ్లిక్ పార్కుల్లో సంచరిస్తూ హత్యలకు పాల్పడ్డారు. సెర్గీ యెవ్స్వెవ్ అనే బ్యాంకు ఉద్యోగిని 107 సార్లు కత్తులతో కర్కశంగా పొడిచి హత్య చేశారు. దిక్కూ మొక్కులేని దీనుల హత్యలు జరిగినప్పుడు పెద్దగా స్పందించని మాస్కో పోలీసులు.. బ్యాంకు ఉద్యోగి హత్య సంచలనం సృష్టించడంతో తీవ్రంగా దర్యాప్తు జరిపి హంతక దంపతులను అరెస్టు చేశారు.
హత్యకు గురైన బ్యాంకు ఉద్యోగి ఫుట్పాతర్ కాదని, అతనికి ఇల్లు కూడా ఉందని మృతుడి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు తాగుబోతు కూడా కాదని తెలిపాడు. ఓ స్నేహితుడిని కలవడం కోసం పబ్లిక్ పార్కులో నిరీక్షిస్తుండగా హంతక దంపతులు దాడిచేసి దారుణంగా హత్య చేశారని చెప్పాడు. మొత్తం 12 హత్యలకు పాల్పడిన ఆ క్రిమినల్ దంపతులు చివరకు కటకటాలపాలయ్యారు.