భారత్ ఘాటు స్పందన: లఖ్వీపై తగ్గిన పాక్, 3 నెలలు జైల్లో
న్యూఢిల్లీ: రావల్పిడీ ఉగ్రవాద నిరోదక న్యాయస్థానం గురువారం నాడు ముంబై పేలుళ్ల నిందితుడు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ఘాటుగా స్పందిస్తోంది. పాకిస్తాన్ మాటలకు, చేతలకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తీవ్రవాదం పైన పోరాడుతామని చెబుతూనే పేలుళ్లకు కారకులైన వారిని వదిలేస్తోందని మండిపడింది. తీవ్రవాదం విషయంలో పాకిస్తాన్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పింది. కాగా, లఖ్వీ ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నారని తెలుస్తోంది.
పెషావర్ పాఠశాలలో అభం శుభం తెలియని చిన్నారులను, ఉపాధ్యాయులను తాలిబన్లు హతమార్చిన మరుసటి రోజే లఖ్వీకి బెయిల్ రావడం, భారత్ ఘాటుగా స్పందించడం పాకిస్తాన్ను కలవరపెట్టింది. దీంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది.
లఖ్వీకి బెయిల్ వచ్చినా విడుదల చేయవద్దని పాకిస్తాన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లఖ్వీ బెయిల్ వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. లఖ్వీకి వచ్చిన బెయిల్ పిటిషన్ పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు, అతని పైన మరికొన్ని చట్టాల కింద కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బెయిల్ వచ్చినా లఖ్వీ ఇంత వరకు విడుదల కాలేదు.
మూడు నెలలు జైల్లోనే..
లఖ్వీకు బెయిల్ రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాక్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (ఎంపీవో) కింద మూడు నెలలు నిర్బంధంలో ఉంచనుంది. ఈ రోజు లఖ్వీ విడుదల కావాల్సి ఉందని, కానీ ఎంపీవో కింద అతడిని నిర్బంధించిందని అధికారులు చెప్పారు. పాక్ ఈ సమాచారం భారత్కు ఇచ్చింది.
లఖ్వీకి బెయిల్ నిరాకరిస్తూ లోకసభ తీర్మానం
లఖ్వీకి బెయిల్ నిరాకరిస్తూ లోకసభ శుక్రవారం తీర్మానం చేసింది. అంతకుముందు.. లఖ్వీకి బెయిల్ రావడంతో ప్రతి భారతీయుడి హృదయం తల్లడిల్లిందని, ఉగ్రవాదికి బెయిల్ ఇవ్వడం మానవతావాదం కాదని, ఈ విషయమై పాక్కు సందేశం పంపించామని ప్రధాని మోడీ చెప్పారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాక్కు చెప్పామని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరు చేస్తామన్న పాక్ లఖ్వీకి బెయిల్ ఇవ్వడం ద్వారా హామీని తప్పినట్లయిందన్నారు.