ఎవరీ ధనశ్రీ?: స్పిన్ మాయలో డెంటిస్ట్: ఆర్సీబీ బౌలర్కు పర్పుల్ క్యాప్పై తెగ సంబరాలు
అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది. ఇదివరకు ఏ సీజన్లో కూడా లేనివిధంగా ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. అద్బుతంగా రాణిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్లు ఆడిన కోహ్లీ సేన..మూడింట్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ప్రత్యేకించి- శనివారం సాయంత్రం నాటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై రాయల్ ఛాలెంజర్స్ ఆడిన తీరు ఆశ్యర్యానికి గురి చేసింది.
తొలుత బౌలింగ్లో.. ఆ తరువాత బ్యాటింగ్లో మెరుపులు మెరిపించింది బెంగళూరు టీమ్. వార్ మొత్తం వన్సైడ్ చేసింది. పరుగులు తీయడానికి రాజస్థాన్ రాయల్స్ టీమ్ బ్యాట్స్మెన్లు ఆపసోపాలు పడిన పిచ్పై.. పీక్ రేంజ్లో రాణించారు బెంగళూరు బ్యాట్స్మెన్లు. బెంగళూరు బౌలర్ల ధాటికి స్మిత్ టీమ్.. 154 పరుగులకే పరిమితమైంది. మిడిల్ ఆర్డర్లో ల్యామ్రోర్, రాహుల్ తెవాటియా ధాటిగా ఆడకపోయి ఉంటే.. ఆ మాత్రం పరుగులు కూడా స్కోరుబోర్డులో చేరేవి కావు. 39 బంతుల్లో మూడు సిక్సులు, ఒక ఫోర్తో 47 పరుగులు చేశాడు ల్యామ్రోర్. రాజస్థాన్ టీమ్లో అతనే టాప్ స్కోరర్. 12 బంతుల్లో మూడు సిక్సర్లతో తెవాటియా 24 రన్స్ సాధించాడు.
ధోనీ ఏజ్ బార్: టీమిండియా మాజీ ఆల్రౌండర్ కామెంట్స్: భజ్జీకి తగిలిన సెగ: నిజం బయటికి
ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఏస్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మూడు వికెట్లను పడగొట్టాడు. సంజు శాాంసన్, రాబిన్ ఊతప్ప, ల్యామ్రోర్ను పెవిలియన్ దారి పట్టించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఉన్నంతలో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మూడు వికెట్లతో పర్పుల్ క్యాప్.. చాహల్ సొంతమైంది. ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్లను ఆడిన చాహల్ ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్కు ఇచ్చే పర్పుల్ క్యాప్.. చాహల్ వశమైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డును కూడా అతనే అందుకున్నాడు.
యజువేంద్ర చాహల్కు పర్పుల్ క్యాప్ లభించడం పట్ల అతనికి కాబోయే భార్య ధనశ్రీ వర్మ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. పర్పుల్ క్యాప్ను అందుకున్న వెంటనే చాహల్కు శుభాకాంక్షలు చెప్పారామె. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ న్యూ పర్పుల్ క్యాప్ హోల్డర్ ఆఫ్ ఐపీఎల్ 2020.. ద నేమ్ ఈజ్ యజువేంద్ర చాహల్ అనే స్లైడ్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. మోర్ పవర్ టు యు లవ్ అనే క్యాప్షన్ను దానికి యాడ్ చేశారు.
Recommended Video
ధనశ్రీ వర్మ.. యజువేంద్ర చాహల్ కాబోయే భార్య. ఈ ఏడాది ఆగస్టులో వారిద్దరికి నిశ్చితార్థమైంది. వృత్తిపరంగా ఆమె డెంటిస్ట్. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇటీవలే ఇంటర్న్షిప్ పూర్తి చేశారు. లాక్డౌన్ సమయంలో బీసీసీఐ నిర్వహించిన జూమ్ వర్క్షాప్ల్లో చాహల్-ధనశ్రీ మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో ఆగస్టులో నిశ్చితార్థం కుదిరింది. కొరియోగ్రాఫర్, యూట్యూబర్గా గుర్తింపు తెచ్చుకున్న ధనశ్రీ వర్మ ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.