IPL 2020: రసవత్తరంగా ప్లే ఆఫ్ సీన్: నాలుగు జట్లు పోటీ..ఉండేదెవరు వెళ్లేదెవరు..? హైదరాబాద్: ఇండియన్ ప
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ 2020 లీగ్ దశలో ఆరు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్ చేరుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. ఆరు జట్లలో ఏ టీమ్ ప్లేఆఫ్కి చేరుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రోజుకో మలుపు తిరుగుతుండడంతో లీగ్ రసవత్తరంగా సాగుతోంది.
ప్లేఆఫ్ రేసు రసవత్తరం:
సులువుగా ప్లేఆఫ్ చేరేలా కనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలను అందుకోలేకపోయాయి. 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో బెంగళూరు, 9 మ్యాచ్ల్లో 7 విజయాలతో ఢిల్లీ.. చెరో 14 పాయింట్లతో తేలికగా ప్లేఆఫ్లో అడుగుపెట్టేలా కనిపించాయి. కానీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఢిల్లీ చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోగా.. బెంగళూరు చివరి రెండు మ్యాచ్ల్లోనూ పరాజయాల్ని ఎదుర్కొంది. దాంతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్లు ఒక్కసారిగా రేసులోకి వచ్చాయి.
సన్రైజర్స్పై గెలిస్తే:
బెంగళూరు ప్రస్తుతం 14 పాయింట్లతో ఉండగా.. మిగిలిన రెండు మ్యాచ్లకిగానూ ఆ జట్టు కనీసం ఒక్క మ్యాచ్లో విజయం సాధించినా ప్లేఆఫ్కి అర్హత సాధిస్తుంది. బెంగళూరు శనివారం సన్రైజర్స్పై గెలిస్తే.. నేరుగా ప్లేఆఫ్లో అడుగుపెడుతుంది. ఓడినా చివరి మ్యాచులో ఢిల్లీపై గెలిస్తే ప్లేఆఫ్ వెళుతుంది. దాదాపు ఢిల్లీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్లో ముంబైని ఓడిస్తే ముందంజ వేస్తుంది. ఒకవేళ ఓడితే ఢిల్లీ తమ చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరుపై గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు ఖరారవుతుంది. ఢిల్లీ, బెంగళూరు తమ చివరి రెండు మ్యాచులలో ఓడితే.. నెట్రన్రేట్ను బట్టి ముందంజ వేసే అవకాశముంటుంది.
చెన్నైని ఓడిస్తే:
తొలి ఏడు మ్యాచ్ల్లో ఒక్కదాంట్లోనే నెగ్గి.తర్వాత ఐదు మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్ దిశగా అడుగులేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఇప్పుడు పంజాబ్తో పాటు కోల్కతా, రాజస్థాన్ తలో 13 మ్యాచ్లాడి 12 పాయింట్లతో ఉన్నాయి. పంజాబ్ తన చివరి మ్యాచ్లో చెన్నైని ఓడిస్తే ప్లేఆఫ్ అవకాశాలున్నట్లే. మరోవైపు కోల్కతా, రాజస్థాన్ మధ్య పోరులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు మిగతా మ్యాచ్ల ఫలితాలు, నెట్ రన్రేట్ను బట్టి ముందంజ వేస్తుంది.
రెండు మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే:
12 మ్యాచ్లాడి 10 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి రెండు మ్యాచ్ల్లో బెంగళూరు, ముంబైలతో తలపడనుంది. ప్లేఆఫ్ రేసులో ఉన్న మిగతా జట్లతో పోలిస్తే మెరుగైన నెట్ రన్రేట్ ఉన్న సన్రైజర్స్ ఈ రెండు మ్యాచ్ల్లోనూ గెలిస్తే నేరుగా ముందంజ వేసే అవకాశాలున్నాయి. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్కు దూరమవుతుంది. సన్రైజర్స్ శనివారం రాత్రి బెంగళూరుతో తలపడనుంది. గత మ్యాచ్లో ఢిల్లీపై భారీ విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆ జట్టు.. ఆర్సీబీపై కూడా అదే జోరు కొనసాగిస్తుందన్న ఆశతో అభిమానులున్నారు.