IPL 2020:ఈ సారి మిగతా జట్లకే కప్ గెలిచే అవకాశం, ముంబై ఇండియన్స్కు లేదు: ఎమ్మెస్కే
హైదరాబాద్: ఐపీఎల్ 2020 టైటిల్ ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం లేదని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఈ సారి నయా చాంపియన్ అవతరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తెలుగు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న ఎమ్మెస్కే.. శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కామ్ బాక్స్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
సహచర కామెంటేటర్ కల్యాణ్తో సరదాగా టైటిల్ విన్నర్ను అంచనా వేసిన ఎమ్మెస్కే.. తన మనసులోని మాటను చెప్పాడు. ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుతుందని కానీ.. టైటిల్ మాత్రం ఇప్పటి వరకు అందుకోని జట్లకు దక్కుతుందని జోస్యం చెప్పాడు. ఏ టీమ్ అనేది చెప్పనప్పటికీ.. టైటిల్ గెలవని జట్లైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్లకు అవకాశం ఉందని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
టీ20ల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేమని, వరుస విజయాలతో దూసుకెళ్లిన జట్లకు కూడా పరాజయం తప్పదన్నాడు. గెలుపు గుర్రాలకు ప్రతీకూల పరిస్థితులు ఎదురవుతాయన్నాడు. పటిష్ట ముంబైని రాజస్థాన్ రాయల్స్ మట్టికరిపించిందని, 190కి పైగా పరుగులు చేసినా ముంబై విజయాన్నందుకోలేకపోయిందని ఈ మాజీ చీఫ్ సెలెక్టర్ తెలిపాడు. అలాంటి పరిస్థితి ఎదురైతే ముంబైకి కష్టాలు తప్పవన్నాడు. పైగా తటస్థ వేదికలో జరుగుతుండటం నయా చాంపియన్ అవతరించడానికి సానుకూలంశమని తెలిపాడు.
ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జైత్ర యాత్రకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేయడంతో ప్లే ఆఫ్ చేరే జట్టు ఏదో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నాడు. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిస్తే ఆఖరి మ్యాచ్ పూర్తయ్యేవరకు ప్లే ఆఫ్స్లో నాలుగో బెర్త్ ఎవరిదో చెప్పలేమన్నాడు. ఇక ఫస్టాఫ్లో తెలిపోయిన కింగ్స్ పంజాబ్ సెకండాఫ్లో వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్లింది. కానీ ఆ జట్టు జైత్రయాత్రకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. క్రిస్ గేల్(99) విధ్వంసంతో పంజాబ్ విధించిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా చేధించి 7 వికెట్లతో సునాయస విజయాన్నందుకుంది.