IPL 2020: ముంబై ఇండియన్స్కు భయపడాల్సిన పనిలేదు: ఢిల్లీ కెప్టెన్ అయ్యర్
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరగబోయే తొలి క్వాలిఫయర్ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ముంబైతో మ్యాచ్లో తాము సహజ సిద్ధమైన ఆటను ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు. ముంబై జట్టు అంటే తమకు ఎలాంటి భయం లేదని, ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం అని పేర్కొన్నాడు. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించడంతో టాప్-2కు చేరింది. అగ్ర స్థానంలో ముంబై ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... 'ముంబై ఇండియన్స్ జట్టు అంటే మాకు ఎలాంటి భయం లేదు. ముంబై అత్యుత్తమ జట్లలో ఒకటి. అయినా మాలో ఆత్మవిశ్వాసం ఉంది. మా జట్టు కూడా బలంగానే ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబైపై విజయం సాధిస్తామా లేదా అనేది ఆరోజు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ముంబైకు ఫైనల్స్ ఆడిన అనుభవం చాలా ఎక్కువ. ఆ జట్టు పటిష్టంగా ఉందనే విషయం ఒప్పుకోవాలి. అప్పటి పరిస్థితిని బట్టే విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఏ విషయాన్నైనా ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడిలో పడతాం. అది పెద్ద సమస్యగా మారిపోతుంది' అని తెలిపాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఈ విజయం తమకు చాలా అవసరమే కాకుండా ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు పూసాయన్నాడు. అనేక ఎత్తు పల్లాల తర్వాత రెండో స్థానానికి చేరడం ఆనందంగా ఉందన్నాడు. అందరూ సమిష్టిగా రాణించడం వలనే ఇక్కడివరకు వచ్చామని చెప్పాడు. గురువారం దుబాయ్ వేదికగా ముంబై- ఢిల్లీ జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరుగుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడుతుంది.
రాయల్ చాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా.. ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ (54: 41 బంతుల్లో 6ఫోర్లు), అజింక్యా రహానే (60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి విజయానికి బాటలు వేశారు. అయితే ఆర్సీబీ ఓడినప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరింది.