IPL 2020: నాడు పానీ పూరీ అమ్మిన కుర్రాడే నేడు కోటీశ్వరుడు: ఎవరీ యశస్వీ జైస్వాల్..?
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ఈ రోజు నాల్గవ మ్యచ్ చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ముంబైపై విజయం సాధించి రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగనుండగా దుర్భేధ్యమైన ధోనే జట్టును ఢీ కొట్టేందుకు తన అస్త్రాలను రెడీ చేసుకుంటోంది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కు ఈ సారి యశస్వీ జైస్వాల్ రూపంలో తురుపు ముక్క దొరికిందనే చెప్పాలి. ఇంతకీ యశస్వీ జైస్వాల్ ఎవరు..? ఏంటీ కుర్రాడి నేపథ్యం..?

అందరి కళ్లు ఆ కుర్రాడి వైపే
ఐపీఎల్.. బిగెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆన్ ఎర్త్.. ఈ మెగా టోర్నీ ఎంతో మంది గల్లీ క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది. ఆటగాళ్ల టాలెంట్ ఈ మెగా టోర్నీ ద్వారా బయటపడి ఏకంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే గోల్డెన్ ఛాన్స్ వారికి దక్కిందంటే ఇది ఐపీఎల్ పుణ్యమే అని చెప్పాలి. ఈ క్యాష్ రిచ్ గేమ్ ఎంతో మంది పేద క్రికెటర్లను ఓ స్థాయికి తీసుకెళ్లింది. టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఎదురుచూస్తున్న ఎందరో యువక్రికెటర్లు ఈ టోర్నీ ద్వారా తమ బతుకులను బాగుచేసుకోవడమే కాదు.. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఇక మంగళవారం జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్లో అందరి కళ్లు రాజస్థాన్ ఆటగాడు యశస్వీ జైస్వాల్ పై ఉన్నాయి.

భారత్ తరపున అండర్ -19 ఆడిన యువకెరటం
భారత్ తరపున అండర్ -19 ఆడిన ఈ యువకెరటం దిశ ఐపీఎల్తో ఒక్కసారిగా మారిపోయింది. ఒకేసారి రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని రూ.2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్లో జైస్వాల్ తప్పకుండా రాణిస్తాడనే విశ్వాసం వ్యక్తం చేశాడు ఈ చిచ్చరపిడుగు చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్. జైస్వాల్ సత్తా ఏంటో తనకు బాగా తెలుసన్న జ్వాలా సింగ్... ఈ ఐపీఎల్లో తప్పకుండా షైన్ అవుతాడని పేర్కొన్నాడు. క్వారంటైన్ సమయంలో తాను యోగా, ఇతర వ్యాయామాలు చేసి తనను తాను పూర్తిగా ఫిట్ ఉండేలా చూసుకున్నట్లు చెప్పినట్లు తన కోచ్ జ్వాలా సింగ్ చెప్పాడు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా కావాలన్న తన సుదీర్ఘ స్వప్నం ఐపీఎల్తో నిజం కాబోతోందని చెప్పాడు. ఇక్కడ సత్తా చాటితే అవకాశాలు వాటంతకు అవే వెతుక్కుంటూ వస్తాయని కోచ్ జ్వాలా సింగ్ చెప్పాడు. ఈ టోర్నీలో ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లను కలిసే అవకాశం ఉంటుందని వారి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని తాను జైస్వాల్కు చెప్పినట్లు జ్వాలా సింగ్ వెల్లడించాడు.

రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
పానీపూరీలు అమ్ముకునే స్థాయి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే స్థాయికి జైస్వాల్ ఎదగడంపై కోచ్ హర్షం వ్యక్తం చేశాడు. అండర్ -19 ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును 18 ఏళ్ల జైస్వాల్ గెలుచుకున్నాడు. ఇతని నైపుణ్యంను చూసిన రాజస్థాన్ రాయల్స్ వేలంపాటలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూ.2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో జైస్వాల్ జాతకమే మారిపోయింది. యశ్వస్వీ జైస్వాల్ సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ అయితే.. క్రికెట్ కోసం ముంబైకి వచ్చి కోచ్తోనే ఉంటున్నాడు. ఇక ఐపీఎల్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.. ఆల్ ది బెస్ట్ యశస్వీ జైస్వాల్.












Click it and Unblock the Notifications