హార్ధిక్ పాండ్య ఎందుకు బౌలింగ్ చేయలేదంటే...?
చెన్నై: భుజం సమస్య కారణంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదని ముంబై ఇండియన్స్ క్రికెట్ డైరెక్టర్ జహీర్ ఖాన్ తెలిపాడు. గత శుక్రవారం జరిగిన ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో ముంబై 2 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో పాండ్యా కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం విమర్శలు వచ్చాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాండ్యా బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని కొంతమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
తాజాగా ఈఎస్పీన్ క్రిక్ఇన్ ఫోతో మాట్లాడిన జహీర్ ఖాన్.. ఈ విమర్శలపై స్పందించాడు. అతి త్వరలోనే పాండ్యా బౌలింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు.'లీగ్ మొత్తంలో హార్దిక్ పాండ్యా ఎంత విలువైన ఆటగాడో మనందరికీ తెలుసు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా తొలి మ్యాచ్లో అతను బౌలింగ్కు దిగలేదు. ఇంగ్లండ్తో సిరీస్లో బౌలింగ్ చేశాడు. చివరి వన్డేలో అయితే ఏకంగా 9 ఓవర్లు బంతిని విసిరాడు. హార్దిక్కు కొంచెం భుజం సమస్య ఉంది. కానీ, ఆందోళన చెందాల్సినంత పెద్దదేమీ కాదు. త్వరలోనే అతను బౌలింగ్కు దిగుతాడు. బంతితోనూ అతడు రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను" అని జహీర్ తెలిపాడు.
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ను బౌలింగ్లో తమ ఆరో బౌలర్గా వాడుకుంటామని జహీర్ తెలిపాడు. బౌలింగ్ విభాగంలో తాము ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నాడు. కాకపోతే ఆటగాళ్లను సర్దుబాట్లు చేయాలని అభిప్రాయపడ్డాడు. ఇదొక హెల్తీ ప్లాబ్లమ్ అని చెప్పాడు.ఇకపోతే సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. మంగళవారం నాటి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని జహీర్ వెల్లడించాడు. 'అతడి క్వారంటైన్ సమయం ముగిసింది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొన్నాడు. మంగళవారం కోల్కతాతో జరిగే మ్యాచ్కు అతను అందుబాటులో ఉంటాడు'అని జహీర్ స్పష్టం చేశాడు.
ఇక బుమ్రా తమ ట్రంప్ కార్డ్ అని తెలిపిన జహీర్ ఖాన్.. అతని అవసరం ఉన్నప్పుడు బౌలింగ్కు దించుతామని తెలిపాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ను టర్న్ చేసే సత్తా అతనికి ఉందని స్పష్టం చేశాడు. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' హర్షల్ పటేల్ పదునైన బౌలింగ్ (5/27)తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు సాధించి గెలిచింది. డివిలియర్స్ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.