IPL 2021: హైదరాబాద్ ఫ్యాన్స్కు బీసీసీఐ బిగ్ షాక్: ఆ బెదిరింపులకు భయపడ్డారా? లేక?
ముంబై: క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండగొచ్చేసింది. సరిగ్గా అయిదునెలల వ్యవధిలో మెగా టోర్నమెంట్ కనువిందు చేయబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొనసాగిన ఐపీఎల్ 2020 మత్తు నుంచి దిగీ దిగకముందే.. మరో సీజన్ వచ్చేసింది. నెలన్నర రోజుల పాటు కొనసాగబోతోంది. అభిమానులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లోబోతోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొద్దిసేపటి కిందటే IPL 2021 scheduleను విడుదల చేసింది.
ఈ సారి మ్యాచ్ల ప్రత్యేకత అదే..
ఇప్పటిదాకా సాగిన 13 సీజన్లకు భిన్నంగా ఈ సారి షెడ్యూల్ను రూపొందించింది బీసీసీఐ. తమ సొంత మైదానంలో ఏ ఒక్క జట్టు కూడా తలపడకపోవడం ఈ సారి ఐపీఎల్ స్పెషాలిటీ. ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడబోదు. తటస్థంగా ఉండే వేదికలపైనే ఆడుతుంది. అదే పరిస్థితి అన్ని జట్లకూ ఉంటుంది. ఏ జట్టు కూడా తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లను ఆడబోదు. తటస్థ వేదికలపై మ్యాచ్లను నిర్వహించాల్సి రావడం పట్ల ఆయా ఫ్రాంఛైజీలకు చెందిన అభిమానులకు తీవ్రంగా నిరాశ కలిగించే విషయమే.
హైదరాబాద్లో నో మ్యాచ్..
హైదరాబాదీ క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ అధికారులు ఈ సారి బిగ్ షాక్ ఇచ్చారు. మ్యాచ్ల నిర్వహణ జాబితాలో హైదరాబాద్కు చోటు కల్పించలేదు. ఆరు నగరాలను మాత్రమే దీనికోసం ఎంపిక చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఏ ఒక్క మ్యాచ్ను కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించకుండాపోయింది. హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడాన్ని అడ్డుకుని తీరుతామంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దానం నాగేందర్ హెచ్చరించిన నేపథ్యంలో.. బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సన్ రైజర్స్లో
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానికెలెవరినీ ఎంపిక చేయకపోవడాన్ని నిరసిస్తూ కొద్ది రోజుల కిందటే దానం నాగేందర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని చూస్తే.. ఆయన బెదిరింపులకు బీసీసీఐ భయపడిందా? లేక. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని.. అసలు మ్యాచ్లే లేకుండా చేసిందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో ఆరు స్టేడియాల్లో మాత్రమే పరిమితం చేయడం, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి చోటు కల్పించకపోవడం నిరాశ పరిచేదే.
ఆ ఆరు స్టేడియాల్లోనే..
దేశవ్యాప్తంగా నాలుగు స్టేడియాల్లో మాత్రమే ఐపీఎల్ మెగా టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు. అహ్మదాబాద్, చెన్నై, ముంబై, కోల్కత, బెంగళూరు, ఢిల్లీల్లో మ్యాచ్లను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ జట్ల మధ్య మొత్తం 56 మ్యాచ్లు జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ మినహాయించి మిగిలిన స్టేడియాల్లో 10 చొప్పున మ్యాచ్లు జరిపేలా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎనిమిది చొప్పున మ్యాచ్లు ఉంటాయి.