CSK vs RCB : ఆ పరుగుల సునామీకి బద్దలైన రికార్డులివే-మామూలుగా లేవుగా..!
నిన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ పోరు పరుగుల సునామీకి వేదికైంది. ఈ సునామీలో పలు రికార్డుల్ని ఇరు జట్లూ బద్దలు కొట్టాయి. ఇందులో పలు ఐపీఎల్ రికార్డులతో పాటు ఇతర టీ 20 రికార్డులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరుగుల సునామీపై ఐపీఎల్ లో పోటీ పడుతున్న అన్ని జట్లు ఇప్పుడు చర్చించుకుంటున్నాయి.
ఐపీఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో చెన్నై, బెంగళూరు ఇరు జట్లు కలిపి మొత్తం 444 పరుగులు సాధించాయి. ఈ స్కోరు చిన్న స్వామి స్టేడియంలో నమోదైన అత్యధిక స్కోరు కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఓ మ్యాచ్ లో నమోదైన ఆరో అత్యధిక స్కోరుగా నిలిచింది. గతంలో ఈ స్టేడియంలో అత్యధిక పరుగుల రికార్డు 425గా ఉంది. ఏప్రిల్ 10న ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది నమోదైంది. అది కాస్తా ఇప్పుడు బద్దలైంది.

అలాగే ఈ మ్యాచ్లో సీఎస్కే సాధించిన స్కోరు ఐపీఎల్ లో ఆ జట్టు మూడో అత్యధిక స్కోరుగా నిలిచింది. 2010లో రాజస్తాన్ రాయల్స్ పై చేసిన 5/246, 2008లో పంజాబ్ కింగ్స్ పై చేసిన 5/240 చెన్నై జట్టుకు టాప్ 2 స్కోర్లుగా ఉన్నాయి. అటు ఆర్సీబీపై చెన్నై చేసిన 226 పరుగుల స్కోరు కూడా ఆ జట్టుపై చెన్నైకు ఇదే అత్యధికం. అదే సమయంలో చెన్నైపై బెంగళూరు చేసిన 216 పరుగుల స్కోరు కూడా వారికి అత్యధికంగా నిలిచింది.
ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ పరుగుల సునామీ పారించారు. ఇందులో చెన్నై బ్యాటర్లు తమ ఇన్నింగ్స్ లో 17 సిక్సర్లు కొట్టారు. తద్వారా తమ గత రికార్డును సమం చేశారు. గతంలో 2018, 2022లోనూ చెన్నై జట్టు బ్యాటర్లు ఒక మ్యాచ్ లో అత్యధికంగా 17 సిక్సర్లు బాదారు. అలాగే నిన్నటి మ్యాచ్ లో 33 గరిష్టాలు నమోదయ్యాయి. ఇది ఐపీఎల్ గేమ్లో ఉమ్మడి అత్యధికంగా కూడా నిలిచింది. ఐపీఎల్లో ఒక మ్యాచ్లో ఇంతకు ముందు రెండు సార్లు 33 సిక్సర్లు కొట్టారు. 2018లో బెంగళూరులో RCB vs CSK, మరియు 2020లో షార్జాలో RR vs CSK మ్యాచ్ ల్లో రెండుసార్లు ఇన్ని సిక్సర్లు కొట్టారు.












Click it and Unblock the Notifications