Kaviya Maran:సన్రైజర్స్ మ్యాచ్లకు నువ్వు రావొద్దు తల్లోయ్
జైపూర్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో చెలరేగింది. ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ను నిర్దేశించినప్పటికీ- అదరలేదు బెదరలేదు. చివరి బంతి వరకూ పోరాడి మరీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. సన్రైజర్స్ చేతిలో ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. ఇదే దూకుడును చూపించగలిగితే ప్లేఆఫ్స్ చేరుకోవడం కష్టమేమీ కాదు.
ఆదివారం రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 214 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఈ మ్యాచ్- హైదరాబాద్ బ్యాటర్ల తెగింపు ధోరణికి అద్దం పట్టింది. చెప్పుకోదగ్గ హిట్టర్లు లేని జట్టుగా గుర్తింపు పొందిన ఆరెంజ్ ఆర్మీ.. చివరి 12 బంతుల్లో ఏకంగా 41 పరుగులను సాధించడం అసాధారణ విషయమే.

చివరి రెండు ఓవర్లల్లో 20కి పైగా రన్రేట్ను పరుగులు చేయాల్సి ఉన్న దశ నుంచి సన్రైజర్స్ మ్యాచ్ను కాపాడుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. 19వ ఓవర్లో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఉన్న మ్యాచ్ను ఉన్నఫళంగా లాగేసుకున్నాడు గ్లెన్ ఫిలిప్స్. ఈ సీజన్లో అతను ఆడిన తొలి మ్యాచ్ ఇదే. వరుసగా విఫలమౌతోన్న హ్యారీ బ్రూక్ స్థానంలో అతన్ని తుదిజట్టులోకి తీసుకుంది సన్రైజర్స్.
తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు ఫిలిప్స్. నాలుగో బంతి బుల్లెట్ వేగంతో బౌండరీ లైన్ దాటించాడు. మొత్తంగా ఆ ఓవర్లో 24 పరుగులు రాబట్టుకుంది సన్రైజర్స్. ఏడు బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్తో 25 పరుగులు చేసి ఫిలిప్స్ అవుట్ అయినప్పటికీ- ఆ ఊపును సమద్ కొనసాగించాడు. గెలవడానికి చివరి ఓవర్లో కావాల్సిన 17 పరుగులను అబ్దుల్ సమద్ రాబట్టుకోగలిగాడు.
ఐపీఎల్ చరిత్రలో థ్రిల్లర్గా మిగిలిపోయే మ్యాచ్ ఇది. అనూహ్యంగా లభించిన ఈ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు పండగ చేసుకుంటోన్నారు. హీరోలుగా నిలిచిన గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్ను ఆకాశానికెత్తేస్తోన్నారు. ఫిలిప్స్, అబ్దుల్ సమద్కు లోకల్ పేర్లు పెట్టేశారు కూడా. ఫలక్నుమా ఫిలిప్స్, షేక్పేట్ సమద్గా వారికి నామకరణం చేశారు.

ఈ మ్యాచ్కు సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్ డుమ్మా కొట్టారు. అన్ని మ్యాచ్లకూ అటెండ్ అవుతూ వచ్చిన ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్కు హాజరు కాలేదు. ఇది కాస్తా నెటిజన్లను పని పెట్టింది. కావ్యా మారన్ రాకపోవడం వల్లే సన్రైజర్స్- ఈ మ్యాచ్ను గెలిచిందంటూ సంబరపడుతున్నారు. మిగిలిన నాలుగు మ్యాచ్లను చూడ్డానికి ఆమె స్టేడియానికి రాకూడదని కోరుకుంటోన్నారు. ఆమె లీవ్ తీసుకుంటే సన్రైజర్స్ ఛాంపియన్గా నిలుస్తుందంటూ ప్రిడిక్షన్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications