కల్వకుంట్ల కామెంట్స్ కలకలం: సాగర్ రావు దిష్టిబొమ్మ దగ్ధం, కేసీఆర్ది కూడా.. ఆందోళనలు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామాలయంపై చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. రాయికల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Recommended Video
దిష్టిబొమ్మ దహనం..
ఇటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం వేంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని సత్తుపల్లి మండలం, పట్టణం పార్టీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సత్తుపల్లి రింగ్ రోడ్ కూడలిలో సత్తుపల్లి మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి జోన్నల గడ్డ నరేష్ తదితరులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
మనోభావాలు దెబ్బతీస్తున్నారని..
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్ చేశారని జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా అన్నారు. అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరానికి విరాళాలు ఇవ్వొద్దని.. బీబీజేకి వాళ్ళు బిక్షం ఎత్తుకొంటున్నారని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ విద్యాసాగర్ రావు అసలు హిందువేనా అని ప్రశ్నించారు.
మహానుభావుల కృషి..
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వెనుక ఎందరో మహానుభావులు ఉన్నారని తెలిపారు. లక్షల మంది బలిదానాలు చేయడం వల్లే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగుతుందన్నారు. హిందువుల కల సాకారం అవుతోన్న వేళ.. వివాదాస్పద కామెంట్స్ చేయడం సరికాదన్నారు. రామ మందిర నిర్మాణం హిందువుగా ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమని అన్నారు.
వివాదానికి అజ్యం ఇలా..?
అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. రామ భక్తులు, హిందూ సంఘాల నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. యూపీలో రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు అని సాగర్ రావు కోరారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మన వద్ద రాముడి ఆలయాలు లేవా అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ఇక్కడ ఉన్న ఆలయాలకు విరాళాలు ఇవ్వాలని కోరారు. రాముని పేరు మీద కొందరు భిక్షం ఎత్తుకుంటున్నారని సాగర్ రావు వ్యాఖ్యలు చేశారు. కొత్త నాటాకనికి తెర లేపుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా అని అడిగారు. తామంతా శ్రీరాముని భక్తులమేనని వ్యాఖ్యానించారు. భక్తి అనేది మనసులో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే కామెంట్స్ నిరసిస్తూ బీజేపీ/ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి.