సొంత జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఫిక్స్: మూడు రోజులు అక్కడే: చిత్తూరుకు బదులుగా
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. క్రిస్మస్ వేడుకలను పులివెందులలో జరుపుకోనున్నారు. అదే రోజు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి రావడం వల్ల గండి ఆంజనేయ స్వామివారిని దర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన పర్యటన షెడ్యూల్లో చక్రయపేట మండలాన్ని చేర్చినట్లు చెబుతున్నారు. కడప, ఇడుపులపాయ, చక్రాయపేట, పులివెందులల్లో జగన్ పర్యటన సాగనున్నట్లు సమాచారం. మూడు రోజుల జిల్లా పర్యటన సందర్భంగా ఆయన పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని అంటున్నారు.
ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను తన సొంత ఊరిలో జరుపుకొనే ఆనవాయితీని కొనసాగించనున్నారు. దీనికోసం ఆయన ఈ నెల 23వ తేదీన గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో గల తన క్యాంప్ కార్యాలయం నుంచి కడపకు బయలుదేరి వెళ్తారు. కడప విమానాశ్రయంలో దిగిన అనంతరం హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 24వ తేదీన పులివెందులకు వెళ్తారు. 25వ తేదీన పులివెందులలోని చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు.

అదే రోజు గండి ఆంజనేయ స్వామివారి దర్శనానికి వెళ్తారని సమాచారం. చక్రయాపేట మండలంలో పర్యటనలో భాగంగా ఆయన గండికి వెళ్తారని తెలుస్తోంది. క్రిస్మస్ రోజు ఉదయం ఇడుపుల పాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుంటారు.
25వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ.. అది వాయిదా పడింది. దీనితో ఆయన కడప నుంచి నేరుగా కాకినాడకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇళ్ల నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేస్తారు. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికిక చేరుకుంటారు.












Click it and Unblock the Notifications