కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హుందాయ్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
అమరావతి: గతేడాది డిసెంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం కడపజిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టీల్ ఫ్యాక్టరీలో కొరియా స్టీల్ కంపెనీ హుందాయ్ స్టీల్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం హుందాయ్ స్టీల్ కంపెనీల మధ్య ఒప్పందం త్వరలో జరగనున్నట్లు తెలుస్తోంది.
కొరియా సంస్థ హుందాయ్ స్టీల్తో ప్రభుత్వం ఒప్పందం
కడప జిల్లాలో ఏర్పాటు అయ్యే స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కింద ఏర్పాటు కానుంది. ఇందులో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు హుందాయ్ స్టీల్ కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయి. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం సీఎం జగన్ గతేడాది డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఒప్పందంపై ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అటు హుందాయ్ స్టీల్ కంపెనీల మధ్య చర్చలు ముగిసినట్లు సమాచారం. ఇక ఒప్పందం చేసుకుందామనుకునే సమయానికి కరోనా వైరస్ కబళిస్తుండటంతో ఇది కాస్త వాయిదా పడిందని సీఎం కార్యాలయం చెబుతోంది. కడప స్టీల్ ప్లాంట్లో కొరియా సంస్థ హుందాయ్ దాదాపుగా రూ.15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.
కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్న అడ్వాంటేజెస్
ఇక కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లె వద్ద ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ప్లాంట్కు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండటం, భూములు తక్కువ ధరకే సేకరించడం, అన్నిటికంటే ప్రధానమైనది గండికోట రిజర్వాయర్లో నీలి లభ్యత ఉండటం వంటివి స్టీల్ ప్లాంట్కు అనుకూలంగా ఉన్నాయి. ఇక విద్యుత్ కోసం రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో ఉండటం కూడా కలిసొచ్చే అంశంగా ఉంది. ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న హుందాయ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపింది.
పలుదేశాల నుంచి ముడిసరుకు దిగుమతి
ఇక ఆస్ట్రేలియా, ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల నుంచి నాణ్యమైన ముడిసరుకును దిగుమతి చేసుకుని కడప స్టీల్ ప్లాంట్ నుంచి హై క్వాలిటీ స్టీల్ను తయారు చేయాలనే యోచనలో హుందాయ్ స్టీల్ సంస్థ ఉంది. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే స్టీల్ను పలు రంగాల్లో ఉపయోగిస్తారని వెల్లడించింది. ఇక ఇక్కడి నుంచి తయారయ్యే స్టీల్తో దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ స్టీల్ సరఫరా చేయొచ్చనేది హుందాయ్ ఆలోచనగా ఉంది. తమిళనాడు, కర్నాటక కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు స్టీల్ సప్లయ్ చేయొచ్చని భావిస్తోంది.
20వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
ముందుగా కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏడాదికి మూడు మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం ఉంచుకుంది. ఆ తర్వాత దశలవారీగా పెంచుకుంటూ ఏడాదికి 10 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీలును ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఇక తొలి దశలో 20వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.ఇప్పటికే ఆయా సంస్థల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఇక ఈ పరిశ్రమ ప్రారంభమైతే రాష్ట్రంలో 14వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం.