Badvel Bypoll: నో యునానిమస్..ఇక అదొక్కటే బ్యాలన్స్: బీజేపీ టికెట్ ఆ మాజీ ఎమ్మెల్యేకేనా?
కడప: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన నిర్వహించబోయే ఉప ఎన్నికలో పోరు అనివార్యంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనసేన ఈ ఎన్నికలో అభ్యర్థులను నిలబెట్టట్లేదు. బీజేపీ మాత్రం ఈ ఎన్నికకు సై అంటోంది. జనసేన పార్టీ తోడు లేకుండానే ఉప ఎన్నిక బరిలో దిగబోతోంది. బీజేపీ తరఫున ఎవరు బద్వేలులో పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. నేడో, రేపో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
పోటీ అనివార్యం కావడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికను ఎదుర్కొనడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా స్థాయి నాయకులు విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. బద్వేలు ఉప ఎన్నిక ఇన్ఛార్జ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు.

తాజాగా- వైసీపీ తరఫున పోటీ చేస్తోన్న డాక్టర్ సుధ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బద్వేలు తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కేతన్గర్గ్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య ఆమె. జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తం చేశారు.
ఇక బీజేపీ తరఫున ఎవరు బరిలో నిల్చుంటారనేది ఇంకా తెలియరావట్లేదు. మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములును బరిలో దింపే అవకాశాలను పరిశీలిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జయరాములు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి, విజయం సాధించారు. అప్పటి ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. ఆ పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన 23 మంది వైఎస్సార్సీపీ శాసనసభ్యుల్లో జయరాములు కూడా ఒకరు.
2019 ఎన్నికల్లో జయరాములకు టికెట్ ఇవ్వలేదు. టీడీపీ. డాక్టర్ రాజశేఖర్ను బరిలోకి దింపింది. తన టికెట్ దక్కకపోవడంతో జయరాములు బీజేపీలో చేరారు. ఇక ఆయనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కావడం వల్ల నియోజకవర్గంపై ఆయనకు పట్టు ఉందని కడప జిల్లా బీజేపీ నాయకులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఆయనకు ఓటుబ్యాంకు ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications